AP News: ఏపీలో కోస్తా తీరానికి కోత ముప్పు
ABN, First Publish Date - 2022-08-03T21:55:20+05:30
ఏపీలో కోస్తా తీరానికి కోత ముప్పు ఉందని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ (Nityanand Rai) వెల్లడించారు.
ఢిల్లీ: ఏపీలో కోస్తా తీరానికి కోత ముప్పు ఉందని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ (Nityanand Rai) వెల్లడించారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. రాష్ట్రంలోని 43.35 శాతం తీరానికి అతి తక్కువగాను, 33.27 శాతం తీరానికి ఓ మోస్తరు కోత ముప్పు ఉన్నట్లుగా ఇన్కాయిస్ అధ్యయనం పేర్కొనట్లు తెలిపారు. సముద్రమట్టం పెరగకుండా నియంత్రించే చర్యల కోసం జాతీయ విపత్తు ఉపశమన నిధి (ఎన్డీఎంఎఫ్)కి 15 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. దీనికి అదనంగా తీరప్రాంత కోత వలన నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పించేందుకు జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి మరో వేయి కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. ఈ నిధిని ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఎంఎఫ్ (NDRF NDMF) సంస్థలకు 80-20 నిష్పత్తిలో విభజించడం జరిగిందని నిత్యానంద్ రాయ్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలో ఎన్డీఎంఎఫ్ను నెలకొల్పిందని తెలిపారు. సముద్ర కోతల వలన తీర ప్రాంతాలకు ఎదురవుతున్న ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సంస్థలు... ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు అందిస్తూ సాంకేతికపరమైన పరిష్కార మార్గాలను సూచిస్తున్నాయని నిత్యానంద్ రాయ్ చెప్పారు.
Updated Date - 2022-08-03T21:55:20+05:30 IST