టీటీడీ పాలకమండలి నిర్ణయాలు
ABN, First Publish Date - 2022-04-30T22:36:35+05:30
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. త్వరలోనే ముంబైలో
తిరుమల: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. త్వరలోనే ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుప్థాపన చేయనున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి జమ్ములో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో మే 5 నుంచి భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. సర్వదర్శనం, స్లాట్ దర్శన టోకెన్లను కొనసాగిస్తామన్నారు.
నడక మార్గంలో వచ్చే భక్తులకు త్వరలో దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తామని ఆయన తెలిపారు. మే 5న సీఎం జగన్ చేతుల మీదుగా శ్రీనివాస సేతు తొలి దశను ప్రారంభిస్తామన్నారు. 2023 మార్చిలో శ్రీనివాస సేతు రెండో దశను ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. బాలాజీనగర్లో ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్ కోసం 2.86 ఎకరాలు ఆర్టీసీకి కేటాయించామన్నారు. త్వరలోనే టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని టీటీడీ ఛైర్మన్ తెలిపారు.
శ్రీవారి మెట్టు మార్గం గుండా మే 5వ తేదీ నుంచి భక్తులను అనుమతిస్తామన్నారు. శ్రీవారి ఆలయంలోని రెండు బంగారు సింహాసలను 3.61 కోట్లతో నూతనంగా తయారు చేస్తామని ఆయన తెలిపారు. పద్మావతి ఆస్పత్రిలో 21 కోట్లతో రెండు బ్లాక్లను నిర్మిస్తామన్నారు. శ్రీనివాస సేతు నిర్మాణంకు 100 కోట్ల నిధులను మంజూరు చేశామని ఆయన పేర్కొన్నారు. 36 కోట్లతో రెండు దశలలో ఘాట్ రోడ్డులో మరమ్మతులు చేస్తామన్నారు. గదుల మరమ్మతులకు 19 కోట్ల నిధులను మంజూరు చేశామని ఆయన తెలిపారు.
వ్యర్థ పదార్థాలతో బయో గ్యాస్ని తయారు చేసి అన్నదానం తయారీలో వినియోగిస్తామన్నారు. టీటీడీ అస్థాన సిద్ధాంతిగా వెంకటకృష్ణ పూర్ణ సిధాంతిని నియమించామని ఆయన తెలిపారు. టీటీడీ ఉద్యోగుల క్వార్టర్స్ లో 437 గదులకు మరమ్మతులు చేస్తామన్నారు. వస్తువుల రూపేణా టీటీడీకి విరాళాలు ఇచ్చే దాతలకు దర్శనంలో ప్రాధాన్యత కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్ సూచనల మేరకు స్విమ్స్ లో త్వరలోనే క్యాన్సర్ పేషెంట్స్ కోసం ప్రత్యేకంగా 300 బెడ్లతో వార్డును ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. స్థానికుల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు అదేశాలిచ్చామని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.
Updated Date - 2022-04-30T22:36:35+05:30 IST