ఆ ముగ్గురి అంతుచూస్తా
ABN, First Publish Date - 2022-12-31T05:28:23+05:30
‘‘నియోజకవర్గంలో ఆ ముుగ్గురూ వైసీపీ ప్రతిష్ఠను భంగపరిచారు.
నా వ్యక్తిగత విషయాల జోలికొస్తే ఊరుకోను
రాయలేని భాషలో హెచ్చరించిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు
బేస్తవారపేట, డిసెంబరు 30: ‘‘నియోజకవర్గంలో ఆ ముుగ్గురూ వైసీపీ ప్రతిష్ఠను భంగపరిచారు. నా వ్యక్తిగత విషయాల్లో జ్యోక్యం చేసుకున్నారు. వారి అంతుచూస్తా’’ అంటూ రాయలేని భాషలో ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు బహిరంగంగానే హెచ్చరించారు. శుక్రవారం బేస్తవారపేట మండల వలంటీర్లు, సచివాలయ కన్వీనర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘2009లో నేను రాజకీయాల్లోకి వచ్చా. ప్రజలకు మంచి చేయాలనుకున్నా. నా ట్రస్టు ద్వారా పదిమందికి ఉపయోగపడుతున్న ఆనందం నాకు ఉంది. నాయకుల మధ్య చిన్నపాటి విభేదాలు తలెత్తితే పార్టీకి నష్టం వాటిల్లకుండా మాట్లాడుకుని సరిచేసుకోవాలి. కానీ అందుకు విరుద్ధంగా ఆ ముగ్గురూ వ్యవహరిస్తున్నారు. రాజకీయాలు శాశ్వతం కాదు. విలువలు ముఖ్యం. నేను ఏం తప్పుచేశాను? నియోజకవర్గంలో ఉద్యోగాలు ఇప్పించి ఏమైౖనా డబ్బులు తీసుకున్నానా? లేదు కదా..! ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సమస్యలకు పరిష్కారం చూపిస్తూన్నా. అయితే నాపై ఎందుకు బురద జల్లుతున్నారు. కొంతమంది చీడపురుగులు చేరి నా తల్లి, భార్యాబిడ్డలను దుర్భాషలాడటం ఎంతవరకు సబబు? అంతేగాక నా కులం పేరుతో తిట్టడం నీచమైన పని. ఆ ముగ్గురి అంతుచూస్తా’’ అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అయితే ఆ ముగ్గురు ఎవరంటూ ప్రతి కార్యకర్త గుసగుసలాడుకోవడం సమావేశంలో కనిపించింది.
Updated Date - 2022-12-31T05:28:32+05:30 IST