పీఆర్సీ జీవోల వ్యవహారంలో ఉద్యోగ సంఘాలు ఐక్యంగా ఉండాలి: సూర్యనారాయణ
ABN, First Publish Date - 2022-01-19T17:49:53+05:30
పీఆర్సీ జీవోల వ్యవహారంలో అన్ని ఉద్యోగ సంఘాలు ఐక్యంగా ఉండాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.సూర్యనారాయణ అన్నారు.
విజయవాడ: పీఆర్సీ జీవోల వ్యవహారంలో అన్ని ఉద్యోగ సంఘాలు ఐక్యంగా ఉండాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.సూర్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఉద్యోగుల సింబాలిక్ నిరసనలతో ఉపయోగం ఉండదన్నారు.ఉద్యోగులంతా తీవ్రమైన నిర్ణయానికి రావాలని చెప్పారు. ఉద్యోగుల అందరి లక్ష్యం ఒక్కటిగానే ఉందన్నారు. కలిసి పోరాడితేనే లక్ష్యాన్ని సాధించగలమన్నారు. ప్రభుత్వం భేషజాలకు పోకూడదు.. జీవోలపై పునః సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాలు పేర్లు వేర్వేరు అయినా అందరూ ప్రభుత్వ ఉద్యోగులేనని అన్నారు. అసుతోష్ మిశ్రా కమిటి నివేదికను పరిగణలోకి తీసుకోవాలన్నారు. అధికారుల కమిటీ సిఫార్సులు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. చట్ట ప్రకారం ఉన్న వేతనాలను తగ్గించేందుకు అవకాశం లేదన్నారు. మరి పీఆర్సీ జీవోలు ఇచ్చి వేతనాలు తగ్గిస్తారా అని నిలదీశారు. హెచ్ఆర్ఏ తగ్గించిన ప్రభుత్వం మండల స్థాయిలో 1600 రూపాయలకు ఒక గది ఎక్కడైనా అద్దెకు ఇస్తుందా అని ప్రశ్నించారు. అన్ని ఉద్యోగ సంఘాలు ఏక తాటిపై వచ్చి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడతామన్నారు. పీఆర్సీ అంశంపై కొందరు మంత్రులు బాధ్యతారహిత్యంగా మాట్లాడవద్దని సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2022-01-19T17:49:53+05:30 IST