ఎండలు మాడ్చేశాయి
ABN, First Publish Date - 2022-01-15T08:59:14+05:30
భారీ వర్షాలు, తుఫానులు, వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి ప్రకృతి వైపరీత్యాలతో
- వానలు ముంచేశాయి...
- ప్రకృతి వైపరీత్యాల ఏడాదిగా 2021
- తుఫానులు, వరదలు, పిడుగులతో దేశవ్యాప్తంగా 1750 మంది మృతి
- గడచిన 120 ఏళ్లలో 5వ వేడి సంవత్సరంగా నమోదు
- ఈశాన్య రుతుపవానాల సీజన్లో దక్షిణాదిలో అసాధారణ వర్షపాతం
- భారత వాతావరణ శాఖ నివేదిక
(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)
భారీ వర్షాలు, తుఫానులు, వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి ప్రకృతి వైపరీత్యాలతో 2021వ సంవత్సరం అత్యంత విషాదంగా ముగిసింది. వీటి కారణంగా గడచిన ఏడాది 1,750 మంది మృత్యువాత పడ్డారు. పిడుగులు, ఉరుముల వల్ల 787 మంది, భారీవర్షాల వల్ల 759 మంది, తుఫానుల వల్ల 172 మంది, ఇతర విపత్తుల వల్ల 32 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన ఏడాదిలో రెండు రుతుపవన సీజన్లు, ఎండలు, తుఫాన్లు, ఇతర ఘటనలకు సంబంధించి భారత వాతావరణ శాఖ శుక్రవారం నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో అనేక విషయాలు పొందుపరుస్తూ వాతావరణ మార్పులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి
గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో గత ఏడాది దేశంలో అనేకచోట్ల తీవ్ర వడగాడ్పులు వీచాయి. రికార్డు స్థాయి ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. రుతుపవనాల సీజన్లో కూడా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. దీంతో 1901 నుంచి చూస్తే 2021... ఐదో వేడి సంవత్సరంగా నమోదయ్యింది. గడచిన ఏడాది ఉష్టోగ్రత సగటు కంటే 0.44 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యింది. గతంలో 2009, 2010, 2016, 2017 అత్యంత వేడి సంవత్సరాలుగా నమోదయ్యాయి. 2009లో సాధారణం కంటే 0.55 డిగ్రీలు, 2010లో 0.539 డిగ్రీలు, 2016లో 0.71 డిగ్రీలు, 2017లో 0.541 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. గడచిన ఏడాదిలో సగటు ఉష్టోగ్రత పెరగడానికి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, ఇంకా అక్టోబరు, డిసెంబరు నెలల్లో ఎండలు ఎక్కువగా వుండడం ఓ కారణంగా వాతావరణ శాఖ పేర్కొంది. ఇంకా నైరుతి రుతుపవనాల నాలుగు నెలల సీజన్లో కూడా సగటు కంటే ఉష్టోగ్రతలు ఎక్కువగానే నమోదయ్యాయి.
వర్షాలూ ఎక్కువే...
గత ఏడాది దేశంలో అనేక ప్రాంతాల్లో అసాధారణ వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాల సీజన్లో దీర్ఘకాలిక సగటులో 99 శాతం వర్షపాతం నమోదయ్యింది. పన్నెండు నెలలు చూస్తే దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక సగటులో 105 శాతం నమోదయ్యింది. ఇక నైరుతి రుతుపవనాల సీజన్లో దక్షిణాదిలో 111 శాతం, వాయువ్య భారతంతో 96 శాతం, మధ్య భారతంలో 104 శాతం, ఈశాన్య భారతంలో 88 శాతం వర్షపాతం నమోదయ్యింది.
ఈశాన్య రుతుపవనాల సీజన్లో దక్షిణాదిలో వున్న ఐదు వాతావరణ డివిజన్లు... తమిళనాడు, కేరళ, కర్ణాటక, రాయలసీమ, కోస్తాల్లో దీర్ఘకాలిక సగటు కంటే 171 శాతం ఎక్కువ వర్షపాతం నమోదయ్యింది. ఈ డివిజన్లో మూడు నెలల ఈశాన్య రుతుపవనాల సీజన్లో 579.1 (సగటు కంటే 171 శాతం ఎక్కువ) మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. కాగా గత ఏడాది మే నుంచి డిసెంబరు వరకు ఐదు తుఫానులు సంభవించాయి. వాటిలో బంగాళఖాతంలో మూడు, అరేబియాలో రెండు తుఫానులు వచ్చాయి. వీటితో పాటు అనేక విపత్తులు సంభవించాయి.
Updated Date - 2022-01-15T08:59:14+05:30 IST