YSRCP ఎమ్మెల్సీ కారులో మృతదేహం కలకలం.. వివాహేతర సంబంధమే కారణమా..!?
ABN, First Publish Date - 2022-05-20T13:30:20+05:30
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో మృతదేహం కలకలం రేపుతోంది.
కాకినాడ : వైసీపీ ఎమ్మెల్సీ (YSRCP MLC) అనంతబాబు కారులో మృతదేహం కలకలం రేపుతోంది. ఎమ్మెల్సీ కారులో అనుమానాస్పదంగా యువకుడి మృతదేహం లభించింది. ఆ యువకుడ్ని గతంలో ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్గా (Driver) పనిచేసిన సుబ్రమణ్యంగా గుర్తించారు. నిన్న రాత్రి తమ కొడుకును ఎమ్మెల్సీ తీసుకెళ్లారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అయితే అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడంటూ మృతదేహాన్ని ఎమ్మెల్సీ కారులో (MLC Car) తీసుకుని వచ్చారు. కాగా.. బాధితుల ఆందోళనతో అనంతబాబు కారు వదిలి వెళ్లిపోయారు. సుబ్రమణ్యంను హత్య చేశారంటూ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అసలు కారణం ఇదేనా..!?
వివాహేతర సంబంధమే ఈ హత్యకు పురిగొల్పిందని విశ్వసనీయవర్గాల సమాచారం. ఎమ్మెల్సీతో సన్నిహితంగా ఉండే మహిళతో సుబ్రమణ్యంకు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మృతుడి తల్లిదండ్రులు కనిపించకపోవడంతో ఈ వ్యవహారం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై ఇంతవరకూ ఎమ్మెల్సీ క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. కాగా.. నిన్న అనంతబాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ముఖ్య అనుచరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీలో మునిగితేలారు. ఈ క్రమంలోనే సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం గమనార్హం. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Updated Date - 2022-05-20T13:30:20+05:30 IST