కొత్త పే స్కేళ్లపై మరోసారి ఏపీ సర్కారు సర్క్యులర్ జారీ
ABN, First Publish Date - 2022-01-23T16:50:17+05:30
కొత్త పే స్కేళ్లపై మరోసారి ఏపీ సర్కారు సర్క్యులర్ జారీ
అమరావతి: కొత్త పే స్కేళ్లపై మరోసారి ఏపీ సర్కారు సర్క్యులర్ జారీ చేసింది. 11వ పీఆర్సీ ప్రకారం కొత్త పే స్కేళ్లతో జనవరి నెల జీతాలు చెల్లించేలా బిల్లులు తయారు చేయాలని సర్కారు సర్క్యులర్ ఇచ్చింది. ఈ నెల 20న జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో పేర్కొన్న అంశాల మేరకు కొత్త వేతనాలను చెల్లించేలా చూడాలని డ్రాయింగ్ డిస్బర్స్మెంట్ ట్రెజరీ, సీఎఫ్ఎంఎస్ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ను అనుసరించి 2018 జులై 1 నుంచి 2021 డిసెంబర్ 31 వరకు లెక్కించి కొత్తగా రూపొందించిన సాఫ్ట్వేర్ మాడ్యూల్లో బిల్లులు ప్రాసెస్ చేయాలని సూచనలు చేసింది. ఈ నెల 25 లోగా ప్రక్రియ పూర్తిచేయాలని, డీడీఓలకు కొత్త పే రోల్స్ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇచ్చిన ఆదేశాల్లో ఏ మాత్రం మార్పులు లేకుండా కొత్త వేతన స్కేళ్లను అమలు చేయాలంటూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ ఉత్తర్వులు ఇచ్చారు.
Updated Date - 2022-01-23T16:50:17+05:30 IST