గద్దె రామ్మోహన్కు నేను ఏకలవ్య శిష్యుడిని: Kesineni nani
ABN, First Publish Date - 2022-07-02T18:52:32+05:30
కొన్ని విషయాల్లో గద్దె రామ్మోహన్కు తాను ఏకలవ్య శిష్యుడిని అని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు.
అమరావతి: కొన్ని విషయాల్లో గద్దె రామ్మోహన్ (Gadde rammohan)కు తాను ఏకలవ్య శిష్యుడిని అని టీడీపీ ఎంపీ కేశినేని నాని (Kesineni nani) అన్నారు. చాలా కాలం తర్వాత జిల్లా పార్టీ నేతలతో కలిసి ఎంపీ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అగ్ని కుల క్షత్రియుల భవన నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నుంచి కేశినేని నాని రూ. 65 లక్షలు కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమాజానికి ఉపయోగపడే పనులు చేయడంలో గద్దె ముందు వరుసలో ఉంటారన్నారు. అగ్నికుల క్షత్రియుల భవనం విషయంలో గద్దె రామ్మోహన్ కృషి ఉందన్నారు. యాంటీ వేవ్లో కూడా గద్దె గెలిచారని.. తన ఎంపీ ల్యాడ్స్ అంతా గద్దె రామ్మోహన్కే ఇవ్వనున్నట్లు తెలిపారు. విజయవాడ పశ్చిమ సెగ్మెంటులో నగరాల సామాజిక వర్గం వాళ్లు కమ్యూనిటీ హాల్ లేదని అన్నారని, అవసరమైన నిధులు ఇస్తానంటే.. తానే రూ. 4 కోట్లు ఇస్తానని వెలంపల్లి హామీ ఇచ్చారని అయితే... ఆ పని ఇప్పటి వరకు నెరవేర లేదని మండిపడ్డారు. ఇప్పుడైనా తాను నిధులిస్తానంటే.. మళ్లీ రూ. 4 కోట్లు ఇస్తానంటూ వెలంపల్లి హామీ ఇచ్చారని అన్నారు. జగనుకు ఎందుకు ఛాన్స్ ఇచ్చారో కానీ.. నష్టపోయింది పేద ప్రజలే అని ఎంపీ చెప్పుకొచ్చారు.
ఎకానమీ దెబ్బ తినడం వల్ల పేదలే నష్టపోయారన్నారు. గద్దె రామ్మోహన్ లాంటి లీడర్లను ఎన్నుకుంటే ప్రజలకే మంచిదని సూచించారు. ఫ్లైఓవర్లు తామే వేశామని సజ్జల చెప్పుకుంటున్నారని.. కౌంటర్ ఇవ్వాలంటే టైమ్ వేస్ట్ అని అన్నారు. విజయవాడ ఫ్లైఓవర్లు ఎవరు కట్టించారో ప్రజలకు తెలుసని.. తాను ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు సేవ చేసి.. అభివృద్ధి చేయడంలో చంద్రబాబుకు సంతృప్తి ఉంటుందని తెలిపారు. సమాజాన్ని, వ్యవస్థలను నాశనం చేస్తే ఎలాంటి సంతృప్తి ఉండదని ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు.
కాగా... చాలా కాలం తర్వాత జిల్లా పార్టీ నేతలతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అగ్నికుల క్షత్రియుల భవన నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ. 65 లక్షలు కేటాయించారు. ఈ నిధుల ద్వారా అగ్నికుల క్షత్రియులు విజయవాడ ఆటోనగర్లో తమకున్న స్థలంలో భవన నిర్మాణం చేపట్టనున్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధులను కేటాయించినందుకు ఎంపీ కేశినేని నానికి అగ్నికుల క్షత్రియులు కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి, పరిపాలన విషయంలో చంద్రబాబు తీరును కేశినేని నాని ప్రశంసించారు. కొంత కాలంగా పార్టీపై కేశినేని నాని గుర్రుగా ఉన్నారనే ప్రచారంతో కేశినేని నాని వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి.
Updated Date - 2022-07-02T18:52:32+05:30 IST