జగదేవిపేటకు చేరుకున్న తిరుపతి విద్యార్థినులు
ABN, First Publish Date - 2022-09-09T04:31:32+05:30
తిరుపతి శ్రీవెంకటేశ్వర వ్యవసాయ కళాశాల విద్యార్థినులు తమ గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా గురువారం జగదేవిపేట చేరుకున్నారు.
ఇందుకూరుపేట, సెప్టెంబరు 8 : తిరుపతి శ్రీవెంకటేశ్వర వ్యవసాయ కళాశాల విద్యార్థినులు తమ గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా గురువారం జగదేవిపేట చేరుకున్నారు. క్షేత్రస్థాయిలో సాగుపై అవగాహన పెంపొందించుకునేందుకు సుమారు 150రోజులు జగదేవి పేట, ఇందుకూరుపేట, లేబూరు గ్రామాల్లో రైతులతో కలిసి ఉంటారు. విద్యార్థినులుప్రతిరోజూ రైతులతోపాటు పొలాల బాట పట్టనున్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునికతను పూర్తిగా రైతులు తెలుసుకునేలా వారు కృషి చేస్తారు. రైతులు క్రిమి సంహారక వితరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటిని కొనుగోలు చేసేటప్పుడు పాటించాల్సిన మెలకువలను రైతులతో చర్చిస్తారు. వ్యవసాయ రంగంలో రాణించాలంటే స్థానిక వనరులపై అవగాహన కచ్చితంగా అవసరం. అందుకు అనుగుణంగా విద్యార్ధినులు చిత్రపటాల సహాయంతో జగదేవిపేట గ్రామాన్ని రూపుదిద్ది రైతులను ఆకట్టుకున్నారు.ఈ చిత్రపటాల సహాయంతో రానున్న సవాళ్లను రైతులు ఎలా ఎదుర్కోవాలో చక్కగా వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల వ్యవసాయ అధికారి రఘునాఽథరెడ్డి, ఏరువాక కేంద్రం నెల్లూరు ప్రధాన శాస్త్రవేత్త శివజ్యోతి, కీటక శాస్త్రవేత్త సురేఖాదేవి హాజరయ్యారు.
Updated Date - 2022-09-09T04:31:32+05:30 IST