పరిమళించని మొగలి
ABN, First Publish Date - 2022-06-01T05:03:26+05:30
‘ఏటా జూన్ నుంచి మొగలి పువ్వుల ను సేకరించే కూలీలకు దండిగా పని దొరుకుతుంది. చిరు వ్యాపారులకు ఆదాయం సమకూరుతుంది. అత్తరు, సుగంధ ద్రవ్యాలు తయారుచేసే కుటీర పరిశ్రమల కార్మికులకు ఉపాధి లభిస్తుంది’..కానీ ఇదంతా గతం. వరుస విపత్తులతో మొగలి చెట్లు నేలకొరిగాయి.
ప్రారంభమైన సీజన్
జిల్లాలో తగ్గిన సాగు విస్తీర్ణం
విపత్తులతో నేలకొరుగుతున్న చెట్లు
నిలిచిపోయిన ఎగుమతులు
వాణిజ్య పంటగా గుర్తించని ప్రభుత్వం
రైతులు, కూలీలు, బట్టీ నిర్వాహకులకు ఉపాధి కరువు
ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పితే వేలాది మందికి ప్రయోజనం
(ఇచ్ఛాపురం రూరల్)
‘ఏటా జూన్ నుంచి మొగలి పువ్వుల ను సేకరించే కూలీలకు దండిగా పని దొరుకుతుంది. చిరు వ్యాపారులకు ఆదాయం సమకూరుతుంది. అత్తరు, సుగంధ ద్రవ్యాలు తయారుచేసే కుటీర పరిశ్రమల కార్మికులకు ఉపాధి లభిస్తుంది’..కానీ ఇదంతా గతం. వరుస విపత్తులతో మొగలి చెట్లు నేలకొరిగాయి. దీంతో వాటి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. జిల్లాలో ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మా ళి, గార, శ్రీకాకుళం తదితర తీర మండలాల్లో 6 వేల హెక్టారుల్లో మొగలి చెట్లు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఉద్దానంలో కొబ్బరి అంతర్ పంటగా, తోటలు, పొలాల్లో కంచెలుగా రైతులు మొగలి చెట్లు సాగు చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు ఎంతగానో రక్షణనిస్తాయి ఈ చెట్లు. అయితే ఈదురుగాలులకు, తుపాన్లకు మొగలి చెట్లు నేలకొరుగుతున్నాయి. రైతులు వాటిని బతికించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వం కూడా దీనిని ఒక పంటగా గుర్తిం చలేదు. ఫలితంగా పరిహారం దక్కడం లేదు. కనీసం సాగు సూచనలు కూడా ఇస్తున్న దాఖలాలు లేవు. ఒక పంటగా కూడా గుర్తింపునకు నోచుకోలేదు.
ఉద్దానంలో తగ్గుతున్న మొగలి బట్టీలు
ఉద్దానంలో మొగలి బట్టీలు అధికంగా ఉండేవి. కానీ క్రమేపీ వాటి సంఖ్య తగ్గుముఖం పడుతోంది. మొగలి పువ్వు నుంచి వచ్చే వాసన అధికం. ఈ పువ్వులను మొగలి బట్టీలు వద్ద పెద్ద సైజు రాగి పాత్రలో మరిగించి ఆవిరి రూపంలో రసాన్ని తీస్తారు. ఇలా తీసిన రసాన్ని మరో రాగిపాత్రలో నిల్వ చేస్తారు. ఆ రసాన్ని విదేశాలకు విక్రయిస్తుంటారు.వాటితోనే అత్తరు, సుగంధ ద్రవ్యాలను తయారు చేస్తారు. అయితే పండించే రైతులు, సేకరించే కూలీలు, రసాన్ని తయారుచేసే బట్టీ నిర్వాహకుల కంటే అత్తరు, సుగంధ ద్రవ్యాలను తయారుచేసే పరిశ్రమలకే మొగలి కాసులు కురిపిస్తోంది. గతంలో పోల్చుకుంటే ఎగుమతులు కూడా తగ్గుముఖం పట్టాయి. ప్రాసెసిం గ్ యూనిట్లతో పాటు అనుబంధ పరిశ్రమలను నెలకొల్పితే మొగలి సాగుకు ఊతమిచ్చినట్టవుతుంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని మొగలి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
సేకరణ కత్తిమీద సామే
ఏడాదిలో ఆరు నెలల పాటు మొగలి పువ్వులు కాపుకొస్తాయి. ఒక్కో చెట్టు 800 నుంచి 1000 వరకూ పువ్వులకు కాపునిస్తుంది. ఒక్కో పువ్వు రూ.10 నుంచి రూ.12ల వరకూ ధర పలుకు తుంది. అయితే ఈ పువ్వుల సేకరణ అనేది కూలీలకు కత్తిమీద సామే. చెట్టు కొమ్మన పువ్వు కాస్తుంది.మొగలి చెట్లు గుబురుగా పెరుగుతాయి. మొగలి ఆకులకు ముళ్లు ఉంటాయి. వీటిని దాటు కొని చెట్టు కొమ్మ చివరకు వెళ్లి జాగ్రత్తగా పువ్వు కోయాల్సి ఉంటుంది. మొగలి చెట్లుపై ఎక్కువగా పాములు ఉంటాయి. పసరిక పాము లు కాటు వేస్తుంటాయి. మరోవైపు గుబురుగా ఉండే మొగలి చెట్ల మధ్య ఎలుగుబంట్లు సేదదీరుతుంటాయి. మొత్తానికి ప్రమాదం మాటున ఈ మొగలి పువ్వుల సేకరణ ఉంటుంది.
అంతర పంటగా గుర్తించాలి
తితలీ తుపాను సమయంలో దాదాపు మొగలి చెట్లు నేలకొరిగాయి. అప్పటి నుంచి పువ్వుల దిగుబడి తగ్గిపో యింది. జీడి, మామిడి, కొబ్బరి మాదిరిగా మొగలి చెట్లను కూడా ప్రభుత్వం గుర్తించాలి.రాయితీల రూపంలో ప్రోత్సా హంతో పాటు విపత్తుల సమయంలో నష్టానికి పరిహారం అందించాలి. ఉద్యానశాఖ అధికారులు కొబ్బరిలో అంతర పంటగా మొగలిని గుర్తించాలి.
- పులకల.ధర్మారావు, మొగళి రైతు, పెద్దలక్ష్మీపురం.
మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి
ఉద్యాన, వ్యవసాయ రంగాలకు అనుబంధంగా ఉన్న మొగలి పువ్వు పరిశ్రమలకు ప్రభుత్వం రాయితీలు కల్పించ కపోవడంతో నష్టాలే మిగులుతున్నాయి. విద్యుత్ రాయితీ, మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే మరింతగా పురోగతిని సాధించగలం. స్థానిక యువతకు, కూలీలకు ఉపాధి అవకాశాలు మెరుగుప డతాయి. ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలి
- చీకటి.గోపాలు, మొగళి రైతు, డొంకూరు
ప్రభుత్వానికి నివేదించాం
జిల్లాలో మొగలి సాగు అధికమే. కానీ ఇంతవరకూ ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీ పథకాలు రాలేదు. మొగలిని ఉద్యాన, వ్యవసాయ రంగాలకు అనుబంధంగా గుర్తించాలని రైతుల నుంచి విన్నపాలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తాం. మొగలి పంట స్థితిగతులను వివరిస్తాం. తప్పకుండా రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం.
- ఆర్.ప్రసాద్, ఏడీ, ఉద్యాన శాఖ
Updated Date - 2022-06-01T05:03:26+05:30 IST