వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి
ABN, First Publish Date - 2022-08-24T04:45:36+05:30
వినాయకచవితి సందర్భంగా మండపాల ఏర్పాటు, ఉత్సవాల నిర్వహణకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్పీ జీఆర్ రాధిక వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఆగస్టు 23: వినాయకచవితి సందర్భంగా మండపాల ఏర్పాటు, ఉత్సవాల నిర్వహణకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్పీ జీఆర్ రాధిక వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘వినాయక మండపాల ఏర్పాటు కోసం సబ్ డివిజనల్ పోలీసు అధికారి నుంచి నిర్వాహకులు అనుమతి పొందాలి. దరఖాస్తుతోపాటు మునిసిపాల్టీ లేదా పంచాయతీ, అగ్నిమాపక, విద్యుత్ శాఖల అనుమతులను జతచేయాలి. ఎట్టిపరిస్థితుల్లో బలవంతపు చందాలు, వసూళ్లు చేయరాదు. దర్శనాల కోసం టిక్కెట్లను పెట్టకూడదు’ అని ఎస్పీ స్పష్టం చేశారు. ‘అంతటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. మట్టి వినాయక ప్రతిమలు వినియోగించాలి. ఊరేగింపు సమయంలో అశ్లీల పాటలు, నృత్యాలు చేయరాదు. మందుగుండు సామగ్రి వెలిగించరాదు. శబ్ద కాలుష్యం లేకుండా పగటిపూట 55 డెసిబుల్స్, రాత్రి వేళ 45 డెసిబుల్స్ దాటకూడదు. బాక్స్ టైపు స్పీకర్లనే వినియోగించాలి’ అని ఎస్పీ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై డయల్ 100 లేదా 6309990933 నెంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Updated Date - 2022-08-24T04:45:36+05:30 IST