వెంకటరావుది హత్యే!
ABN, First Publish Date - 2022-03-19T04:48:13+05:30
‘టీడీపీ కార్యకర్త కోన వెంకటరావుది ఆత్మహత్య కాదు. ఇది ముమ్మాటికీ హత్యే’నని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్చార్జ్జి, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. మందస మండలం పొత్తంగి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన వెంకటరావు సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లా
- మంత్రి, ఎమ్మెల్సీ, డీఎస్పీలే ప్రధాన నిందితులు
- వారిని వెంటనే అరెస్ట్ చేయండి
- ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న డిమాండ్
- మృతుడి కుటుంబ సభ్యులకు పరామర్శ
హరిపురం, మార్చి18: ‘టీడీపీ కార్యకర్త కోన వెంకటరావుది ఆత్మహత్య కాదు. ఇది ముమ్మాటికీ హత్యే’నని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్చార్జ్జి, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. మందస మండలం పొత్తంగి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన వెంకటరావు సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ వెంకటరావు ఆత్మహత్య ఘటనకు మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, పలాస డీఎస్పీ శివరామిరెడ్డిలదే బాధ్యత. వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖరాస్తా. స్పందించకపోతే కోర్టులో ఫిర్యాదు చేస్తా. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కేసును తిరగదీసి ముగ్గురినీ జైలుకు పంపిస్తాం. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. మంత్రికి తొత్తుగా వ్యవహరిస్తున్న డీఎస్పీని వదిలిపెట్టేది లేదు. దమ్ముంటే నాపై కేసు పెట్టండి. పలాసలోనే తేల్చుకుంటా’నని సవాల్ విసిరారు. మత్స్యకారుడై మత్స్యకారులకే ప్రభుత్వ పథకాలు నిలిపివేసిన ఘనత మంత్రి సీదిరి అప్పలరాజు సాధించారని విమర్శించారు. ‘అధినేత చంద్రబాబు మాటగా.. టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా చెబుతున్నా.. రానున్న ఎన్నికల్లో పలాస టీడీపీ అభ్యర్థిగా గౌతు శిరీష బరిలో దిగనున్నారు. పలాస నుంచే జైత్రయాత్ర ప్రారంభిస్తాం. రాష్ట్రంలో టీడీపీ జెండా ఎగురవేద్దాం’ అని పార్టీ శ్రేణులకు బుద్ధా వెంకన్న పిలుపునిచ్చారు. కార్యకర్తలకు టీడీపీ అధిష్ఠానం ఎప్పుడూ అండగా నిలుస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు.
శివాజీ అంత సాఫ్ట్ కాదు
‘నా తండ్రి శివాజీ అంత సాఫ్ట్ కాదు నేను. వేధిస్తే తాట తీస్తా. అందరి పరిస్థితి చూస్తున్నా. వదిలే ప్రసక్తి లేదు’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష హెచ్చరించారు. యాభై ఏళ్లుగా అధికారంలో ఉన్న మా కుటుంబంతో ఎప్పుడైనా, ఎక్కడైనా ఇబ్బందులుకానీ, హత్యలు కానీ జరిగాయా? అని ప్రశ్నించారు. ఇలాంటి దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదని, ఇకపై చూడబోమన్నారు. అనంతరం టీడీపీ తరుపున రూ.2లక్షలు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న రూ.50వేలు, గౌతు కుటంబం రూ.50వేలు, గొరకల వసంతస్వామి రూ.10వేలు, పలాస మున్సిపాలిటీ యువకులు ఆధ్వర్యంలో సప్ప నవీన్ రూ.20వేలు, ఒంగోలుకు చెందిన సీబీఎన్ యువసేన రూ.16వేలును ఆర్థిక సాయంగా వెంకటరావు భార్య కృష్ణకుమారికి అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు వజ్జ బాబూరావు, కె.ప్రభాకరరావు, టీడీపీ నాయకులు పీరుకట్ల విఠల్, జి.వసంతస్వామి, జీవీ నాయుడు, డి.తాతారావు, భావన దుర్యోధన, రాజాన ఝాన్సీ, లింగరాజు, లబ్బ రుద్రయ్య, లచ్చయ్య, పత్రి లోకనాధం, బోర వాసురెడ్డిలతోపాటు సోంపేట, మందస, పలాస నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2022-03-19T04:48:13+05:30 IST