వారి‘కోదండ’ం!
ABN, First Publish Date - 2022-12-05T00:19:19+05:30
శ్రీకాకుళం నగరంలో కోదండ రామాలయానికి ప్రస్తుతం రూ.1,000 కోట్ల విలువైన 485 ఎకరాల భూమి ఉంది. కానీ ఆలయ నిర్వహణ మాత్రం అక్కరకు రాకుండా పోతోంది. ధూపదీప నైవేద్యాలకు కూడా కష్టతరంగా మారింది. శ్రీకాకుళం నగరంతో పాటు ఇతర చోట్ల ఉన్న స్థలాలు, షాపుల ద్వారా వచ్చే ఆదాయంతో ఆలయ నిర్వహణ కొనసాగుతోంది. ఆలయ భూములను సంరక్షించాల్సిన దేవదాయ శాఖ నిద్దరోడుతోంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పరాధీనంలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకోలేకపోతోందన్న అపవాదును మాత్రం మూటగట్టుకుంటోంది.
రూ.1,000 కోట్ల ఆస్తిని కాపాడుకోలేకపోతున్న దేవదాయ శాఖ
కోర్టు తీర్పు ఇచ్చినా.. పరాధీనంలోనే ఆలయ భూములు
దశాబ్దాలుగా పరిష్కారంకాని సమస్య
485 ఎకరాలకు రూపాయి కూడా శిస్తు కట్టని రైతులు
కోదండరామాలయానికి తప్పని నిర్వహణ కష్టాలు
(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)
శ్రీకాకుళం నగరంలో కోదండ రామాలయానికి ప్రస్తుతం రూ.1,000 కోట్ల విలువైన 485 ఎకరాల భూమి ఉంది. కానీ ఆలయ నిర్వహణ మాత్రం అక్కరకు రాకుండా పోతోంది. ధూపదీప నైవేద్యాలకు కూడా కష్టతరంగా మారింది. శ్రీకాకుళం నగరంతో పాటు ఇతర చోట్ల ఉన్న స్థలాలు, షాపుల ద్వారా వచ్చే ఆదాయంతో ఆలయ నిర్వహణ కొనసాగుతోంది. ఆలయ భూములను సంరక్షించాల్సిన దేవదాయ శాఖ నిద్దరోడుతోంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పరాధీనంలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకోలేకపోతోందన్న అపవాదును మాత్రం మూటగట్టుకుంటోంది.
...................
జిల్లాకేంద్రంలోని అతి పురాతనమైన కోదండ రామాలయం భూములు పరాధీనంలో చిక్కుకున్నాయి. శ్రీకాకుళం నగరానికి చెందిన అద్ధమణుగుల వెంకన్నపంతులు, వెంకుభాయమ్మ దంపతులు 1826లో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు స్థల పురాణం చెబుతోంది. దూర ప్రాంతం నుంచి వచ్చే పాదచారుల కోసం సత్రంతో పాటు శ్రీమహాలక్ష్మి సన్నిధి, ఆండాల్ సన్నిధి నిర్మించారు. అప్పటి నుంచి అద్దమణుగుల కుటుంబ సభ్యులే ఽధర్మకర్తలుగా కొనసాగుతున్నారు. వారి తరువాత అనువంశిక ధర్మకర్తగా వారి కుమార్తె రత్నం కొనసాగారు. 1963 ఫిబ్రవరి 13న ఆలయంలో కంచి పీఠాధిపతి పెద్దజీయర్స్వామీజీ రామకోటి స్థంభాన్ని ప్రతిష్టించారు. ఆలయంలో పాంచరాత్ర ఆగమానుసారం పూజలు, కైంకర్యాలు, ఉత్సవాలు కొనసాగేవి. 1966లో ఆలయ దేవదాయశాఖ పరిధిలోకి వెళ్లింది. ప్రస్తుతం అనువంశిక ధర్మకర్తలు కానీ.. వారి కుటుంబసభ్యులు కానీ లేరు.
దేవుడికి మాన్యంగా 730 ఎకరాలు
ఆలయ నిర్వహణకు అద్దమణుగుల వెంకన్నపంతులు దంపతులు తమ యావదాస్తిని ఆలయానికి రాసిచ్చారు. నరసన్నపేట మండలం పోతయ్యవలసలో ఉన్న 730 ఎకరాలను దేవుని మాన్యంగా అందించారు. భూములను పండించి రైతులు పన్ను రూపంలో చెల్లించేవారు. అలా వచ్చిన ఆదాయంతోనే ఆలయ నిర్వహణ కొనసాగేది. 1966లో దేవదాయ శాఖ పరిధిలోకి రావడంతో ఆలయ భూముల స్వాధీనానికి అప్పటి ప్రభుత్వం ప్రయత్నించింది. ఈక్రమంలో భూములు అప్పగించేందుకు రైతులు ముందుకు రాలేదు. దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న భూమి కావడంతో తామే హక్కుదారులమంటూ రైతులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం 1972లో సివిల్ జడ్జి కోర్టు తుదితీర్పును వెల్లడించింది. మొత్తం 730 ఎకరాల భూమిని మూడు విభాగాలుగా విభజించింది. రెండు విభాగాలు కోదండరామలాయానికి.. మిగతా ఒక విభాగం రైతులకు చెందుతుందని స్పష్టం చేసింది. దీని లెక్కన 485 ఎకరాలు దేవుడి మాన్యంగా నిర్థారించారు. అయితే భూముల ఏర్పాటుకు దేవదాయశాఖ స్టాంప్ డ్యూటీ చలానాకు కొంత మొత్తం నగదు చెల్లించాల్సి ఉంది. కానీ అప్పటి ఈవో తాత్సారం చేయడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఆ భూములు పోతయ్యవలస రైతుల ఆధీనంలోనే కొనసాగుతున్నాయి.
2018లో ఒప్పందం కుదిరినా..
కోదండ రామాలయానికి చెందిన ఈ భూములు నిత్యం పచ్చదనంతో తొణికిసలాడుతుంటాయి. మడపాం సమీపంలో వంశధార నదికి ఇరువైపులా ఈ భూములు ఉన్నాయి. ఈ భూమి నుంచి ఎటువంటి శిస్తు వసూలు కాకపోవడంతో 2018లో అప్పటి జేసీ చక్రధరబాబు స్పందించారు. దేవదాయ శాఖ అధికారులతో పాటు భూమి ఆధీనంలో ఉన్న రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎకరాకు ఏడాదికి రూ.3000 శిస్తు కట్టించేలా ఒప్పించారు. 485 ఎకరాలకు సంబంధించి రూ.3 లక్షల శిస్తు వసూలైంది. అక్కడి నుంచి ఏటా శిస్తు వసూలవుతుందని భావించారు. కానీ ఆ తరువాత ఏడాది రూపాయి వసూలు కాలేదు. ఇప్పటివరకూ కూడా అదే పరిస్థితి. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన దేవదాయ శాఖ సుతిమెత్తగా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. 1972లో కోర్టు తీర్పు అమలుకు పట్టుబడలేదు. భూములు వేరు చేసేందుకు చలానాలు సమర్పించలేదు. ఆపై కోర్టులో ‘ఈపీ’ కూడా దాఖలు చేయలేదు. కేవలం ఆలయం నిర్మించి ఆస్తులు సమకూర్చి ఇచ్చిన వివరాలను మాత్రం ఆలయంలో బోర్డుపై వివరాలు నమోదు చేసేశారు. అంతటితో చేయి దులుపుకొన్నారు. కేవలం బోర్డుపై ఇన్ని ఆస్తులున్నట్టు చూపి సంతృప్తి చెందుతున్నారు. రాజకీయ ఒత్తిళ్ల ఫలితంగానే ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదన్న వ్యాఖ్యలు మాత్రం వినిపిస్తున్నాయి.
ఫిర్యాదులే మిగులుతున్నాయి
ఆలయ భూముల రక్షణ కోసం జిల్లా అధికారుల నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం వరకూ 25 ఫిర్యాదులు చేశాను. దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు లేఖలు సైతం రాశాను. ఆలయానికి ఉన్న వందల కోట్ల రూపాయల ఆస్తులు బోర్డుల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. వాటి నుంచి రూపాయి కూడా ఆదాయం సమకూరడం లేదు. కొద్దిపాటి ఆదాయంతో ఆలయ నిర్వహణ కూడా కష్టతరంగా మారుతోంది. ఈ విషయంలో దేవదాయ శాఖ అధికారుల స్పందన ఆందోళన కలిగిస్తోంది.
-సీహెచ్ నాగేశ్వరరావు, ట్రస్ట్ బోర్డు చైర్మన్, కోదండ రామాలయం
Updated Date - 2022-12-05T00:19:23+05:30 IST