మరో బాదుడు
ABN, First Publish Date - 2022-09-20T04:46:18+05:30
రాష్ట్ర ప్రభుత్వం మరో బాదుడుకు సిద్ధమైంది. ఇప్పటికే రకరకాల పన్నులు పెంచిన ప్రభుత్వం తాజాగా 2014 ముందు కొనుగోలు చేసిన వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు(హెచ్ఎస్ఆర్పీ) అమర్చుకోవాలని ఆదేశాలు చేసింది. అమర్చుకోకుంటే రూ. వెయ్యి జరిమానా వేస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో సుమారు 2 లక్షల మంది వాహనదారులకు హెచ్ఎస్ఆర్పీ భారం పడనుంది. కేం
పాత వాహనాలకూ హై సెక్యూరిటీ ప్లేట్లు
లేకుంటే భారీగా జరిమానా
ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
జిల్లావాసులపై రూ.9 కోట్ల భారం
(ఇచ్ఛాపురం రూరల్)
రాష్ట్ర ప్రభుత్వం మరో బాదుడుకు సిద్ధమైంది. ఇప్పటికే రకరకాల పన్నులు పెంచిన ప్రభుత్వం తాజాగా 2014 ముందు కొనుగోలు చేసిన వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు(హెచ్ఎస్ఆర్పీ) అమర్చుకోవాలని ఆదేశాలు చేసింది. అమర్చుకోకుంటే రూ. వెయ్యి జరిమానా వేస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో సుమారు 2 లక్షల మంది వాహనదారులకు హెచ్ఎస్ఆర్పీ భారం పడనుంది. కేంద్ర ప్రభుత్వం 2014 జనవరిలో హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను అమలులోకి తీసుకువచ్చింది. అప్పటి నుంచి కొనుగోలు చేసిన ప్రతీ వాహనానికి హెచ్ఎస్ఆర్పీ నెంబరు ప్లేటు అమర్చుతున్నారు. అప్పటి నుంచి రాష్ట్రంలో కూడా ఈ ప్లేట్లు ప్రతి వాహనానికి అమర్చుతున్నారు. దీనివల్ల వాహనాలకు నెంబరు మార్పిడి అవకాశం ఉండదనేది ప్రభుత్వ ఉద్దేశ్యం. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు దొంగతనాలు, ఇతరత్రా సమయాల్లో దుండగులు వేరే నెంబరు ప్లేటు అమర్చుకొని కిడ్నాపులు తదితర వాటికి అవకాశం ఉండదు.
వాహన రిజిస్ట్రేషన్ ధరలు ఇలా
2014 ముందు జిల్లాలో 2 లక్షల వాహనాలు ఉంటాయని రవాణాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పాత వాహనాలకు హెచ్ఎస్ఆర్పీ ప్లేటు బిగించుకునేందుకు ప్రభుత్వం ధరలను నిర్ణయించింది. 2007 నుండి రోడ్లపై తిరుగుతున్న వాహనాలకు మాత్రమే అమర్చుకోవాల్సి ఉంది. టూవీలర్, వ్యవసాయ ట్రాక్టరుకు రూ.245, ఆటో, ప్యాసింజరు, గూడ్సులకు రూ. 282, లైట్ మోటారు వెహికల్స్ కారుకు రూ.619, హెవీ ట్రాన్స్పోర్టు, మీడియం ట్రాన్స్పోర్టు వెహికల్స్కు రూ.649 చెల్లించాల్సి ఉంది. అంటే సరాసరి ఒక్కోవానానికి రూ.460 అనుకున్నా.. జిల్లాలోని 2 లక్షల వాహనదారులపై రూ.9 కోట్ల భారం పడనుంది.
ఇలా బుక్ చేసుకోవాలి
ఏపీఆర్టీఏసిటిజన్.ఈప్రగతి.ఆర్ వెబ్సైట్లో హెచ్ఎస్ఆర్పీ స్లాట్ బుకింగ్ ఆప్షన్ ఎన్నుకోవాలి. అందులోకి వెళ్లిన తరువాత బుక్ యువర్ స్లాట్ ఆప్షన్ ఉంటుంది. ఒక్కడ క్లిక్ చేసి వాహనం రిజిస్ట్రేషన్ నంబరు, ఆర్సీ కార్డులో ఉన్న చాసిస్ నంబరు ఎంటర్ చేయాలి. తర్వాత ఎంత డబ్బు చెల్లించాలనే ఆప్షన్ వస్తుంది. ఇలా బుక్ చేసిన వెంటనే నెంబరు ప్లేట్ ఏ రోజు బిగించుకోవాలనే సమాచారం అందుతుంది. వాహనదారుడు ఆ మేరకు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది.
సాధ్యమేనా..?
రావాణా శాఖలో కొద్ది నెలలుగా లైసెన్స్లు, ఆర్సీ కార్డులు అందక వాహనాదారలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హెచ్ఎస్ఆర్పీ ప్లేటు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. డిమాండ్కు తగ్గట్లు తయారీ, సరఫరా జరిగితే తప్ప ప్లేట్లను అమర్చలేరు. ఆర్టీవో కార్యాలయాల వద్దకు వెళ్లి అమర్చుకుంటే ఒక రేటు.. ఆన్లైన్లో నేరుగా ఇంటి వద్దకు వచ్చి అమర్చితే ఒక రేటుగా నిర్ణయించారు. నెంబరు ప్లేట్లను కూడా రిజిస్ట్రేషన్ యాప్ ద్వారానే నమోదు చేసుకోవాలి. నిరక్షరాస్యులకు ఇది సాధ్యమేనా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటికే కొత్త వాహనాలకు సక్రమంగా ప్లేట్లు సరఫరా కాక గడువుకన్నా ఆలస్యంగా అమర్చుతున్నారు. ఇప్పుడు పాత వాహనాలకు కూడా తప్పనిసరి చేయడంతో డిమాండ్కు తగ్గట్లు సరఫరా అయ్యేది అనుమానమే.
తప్పనిసరి
ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2014 ముందు కొనుగోలు చేసిన వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు అమర్చుకోవాలి. యాప్లో బుక్ చేసిన తరువాత ప్లేటు ఎక్కడికి వస్తుందో అక్కడకి వెళ్లి వాహనానికి అమర్చుకోవాలి. రెండు నెలల్లో హెచ్ఎస్ఆర్పీ ప్లేటు అమర్చుకోవాల్సి ఉంటుంది.
- సీహెచ్ శ్రీదేవి. డిప్యూటీ కమిషనర్, రవాణా శాఖ, శ్రీకాకుళం
Updated Date - 2022-09-20T04:46:18+05:30 IST