ఉధృతంగా వంశధార
ABN, First Publish Date - 2022-08-10T05:07:25+05:30
ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న భారీ వర్షాలతో గొట్టాబ్యారేజి వద్ద వంశధార ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిలో వరద నీటి ప్రవాహం పెరుగుతుండటంతో వంశధార అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం రాత్రి మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
హిరమండలం, ఆగస్టు9: ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న భారీ వర్షాలతో గొట్టాబ్యారేజి వద్ద వంశధార ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిలో వరద నీటి ప్రవాహం పెరుగుతుండటంతో వంశధార అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం రాత్రి మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఒడిశా నుంచి వచ్చిన నీటినంతా బ్యారేజి దిగువకు విడిచిపెడుతున్నారు. రాత్రి 9 గంటలకు 21 గేట్లు 60 సెంటీమీటర్ల మేర పైకెత్తి 42,289 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచి పెట్టారు. ఎడమ, కుడి ప్రధాన కాలువ గేట్లను మూసివేశారు. అర్ధరాత్రికి నదిలో వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని డీఈఈ క్రాంతికుమార్ తెలిపారు. క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని, కేవలం 7.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైందని వివరించారు.
పాతపట్నం కాజ్వేపై వరద నీరు
పాతపట్నం : అల్పపీడన ప్రభావంతో ఒడిశాలో కురుస్తున్న వర్షాల కారణంగా మహేంద్రతనయ నదిలో నీటి ఉధృతి పెరిగింది. పాతపట్నంలోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయం సమీపంలో కాజ్వే వంతెన నీట మునిగింది. కాజ్వే పై నుంచి నీరు ప్రవహించింది. దీంతో పాతపట్నం పరిధిలలోని కె.గోపాలపురం, హెచ్ గోపాలపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను తహసీల్దార్ కె.రవిచంద్ర అప్రమత్తం చేశారు.
Updated Date - 2022-08-10T05:07:25+05:30 IST