సమన్వయంతో రోడ్డు ప్రమాదాల నివారణ
ABN, First Publish Date - 2022-12-09T23:43:06+05:30
జిల్లాలో పోలీసు, రవాణా, రహదారులు భవనాలు, హైవే అధికారులు సమన్వయంతో పనిచేసి రోడ్డు ప్రమాదాలను నివారించాలని కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ ఆదేశించారు.
- ప్రధాన కూడళ్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి
- చిలకపాలెం టోల్ప్లాజా సిబ్బందిని సర్దుబాటు చేయండి
- కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
అరసవల్లి, డిసెంబరు 9: జిల్లాలో పోలీసు, రవాణా, రహదారులు భవనాలు, హైవే అధికారులు సమన్వయంతో పనిచేసి రోడ్డు ప్రమాదాలను నివారించాలని కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం రహదారి భద్రతపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 175 కిలో మీటర్ల మేర జాతీయ రహదారి ఉందన్నారు. హైవే నుంచి గ్రామాల్లోకి వెళ్లేందుకు సర్వీసు రోడ్లపై సూచిక బోర్డులు, జీబ్రాలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. తప్పుడు మార్గంలో ప్రయాణించకుండా ఉండేందుకు ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడంతో అధిక ప్రమాదాలు జరుగు తున్నాయన్నారు. ప్రధాన కూడళ్ల వద్ద హెచ్చరిక బోర్డులు, హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రమాదాలు అధికంగా జరిగే కవిటి, మంచాలపేట, అదపాక, చిలకపాలెం, కోష్ఠ తదితర ప్రాంతాల్లో సీసీ కెమేరాలు పని చేసేలా చూడాలన్నారు. చిలకపాలెం టోల్ప్లాజా మూతతో రోడ్డనపడ్డ 108 మంది ఉద్యోగులను ఇతర ప్లాజాల్లోకి సర్దుబాటు చేయాలని హైవే అధికారులను ఆదేశించారు. ఏఎస్పీ టీపీ విఠలేశ్వర్ మాట్లాడుతూ.. ప్రతీ పోలీసు స్టేషను పరిధిలో హైవేలపై డ్రమ్ములను ఏర్పాటు చేసి, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నా మన్నారు. ఉప రావాణా కమిషర్ శ్రీదేవి మాట్లాడుతూ.. ఈ ఏడాదిలో నవంబరు వరకు 743 రహదారి ప్రమాదాలు జరిగాయని, 242 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ సమావేశంలో జాతీయ రహదారుల మేనేజర్ సతీష్, డీఎంహెచ్వో బి.మీనాక్షి, శ్రీకాకుళం కార్పొరేషన్, ఆమదాలవలస మునిసిపల్ కమిషనర్లు చల్లా ఓబులేసు, ఎం.రవిసుధాకర్ పాల్గొన్నారు.
దాతలు ముందుకు రావాలి
క్షయవ్యాధిగ్రస్థులకు పౌష్టికాహారం అందించేందుకు దాతలు ముందుకు రావాలని కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ పిలుపునిచ్చారు. శుక్రవా రం బాపూజీ కళామందిర్లో రెడ్క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా టీబీ పేషెంట్లకు ఆరు నెలల పాటు భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు, దాతలు మరింత సహకరిస్తే నిరంతరం ఈ కార్యక్రమాన్ని కొనసాగించవచ్చని చెప్పారు. రెడ్క్రాస్ ఆధ్వర్యంలో హా స్పిటల్ ఏర్పాటుకు అంతా సహకరించాలని కోరారు. జిల్లా ఫారెస్ట్ అధికారి నిషాకు మారి, డీఎంహెచ్వో మీనాక్షి, డీఈవో పగడాలమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-09T23:43:07+05:30 IST