నీవల్లే మామ చావు
ABN, First Publish Date - 2022-08-17T04:39:51+05:30
మామ చనిపోతే దానికి నువ్వే కారణమంటూ వేధింపులు, సూటిపోటి మాటలు. కూతురులాంటిదే కదాని చూడలేదు.. కర్కశంగా వ్యవహరించింది అత్త. ఆ యువతి తట్టుకోలేక పోయింది.
సూటిపోటి మాటలతో అత్త వేధింపులు
భరించలేక ఉరి వేసుకున్న యువతి
పాతపట్నం, ఆగస్టు 16:
మామ చనిపోతే దానికి నువ్వే కారణమంటూ వేధింపులు, సూటిపోటి మాటలు. కూతురులాంటిదే కదాని చూడలేదు.. కర్కశంగా వ్యవహరించింది అత్త. ఆ యువతి తట్టుకోలేక పోయింది. మామ చావు తనపై నెట్టేయడంతో తీవ్ర మనస్తాపం చెందింది. రాత్రి అందరూ పడుకున్నాక ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది. ఈమెకు ఏడాది వయసున్న పాప ఉంది.
- అత్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తామరలో మంగళవారం ఉదయం వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తామర గ్రామానికి చెందిన కూర్మాపు మాధవి (23) సోమవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం కుటుంబసభ్యులు గుర్తించారు. కొత్తూరు మండలం ఆకులతంపర గ్రామానికి చెందిన మాధవికి తామరకు చెందిన ఆశిష్కుమార్తో 2019లో వివాహం జరిగింది. వీరు దగ్గరి బంధువులు. మాధవి ఆశిష్కుమార్ మేనత్త కుమార్తె. అయితే వీరి వివాహం అశిష్ అమ్మ వరలక్ష్మికి ఇష్టం లేదు. కుటుంబసభ్యుల ఒత్తిడి మేరకు వివాహం జరిపించారు. కానీ పెళ్తైన నాటి నుంచి అత్త వేధింపులు అధికంగా ఉండేవి. భర్త ఆశిష్కుమార్ ఆర్మీ ఉద్యోగి. వివాహం జరిగిన తరువాత భార్య మాధవిని కశ్మీరుకు తీసుకెళ్లాడు. వీరికి ఏడాది కుమార్తె ఉంది. ఇటీవల ఆశిష్ తండ్రి అనారోగ్యంతో మృతిచెందడంతో భార్య మాధవి, కుమార్తెతో స్వగ్రామానికి వచ్చారు. సోమవారం తండ్రి దశ దినకర్మను పూర్తిచేశారు. అయితే కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడడానికి, మామ అనారోగ్యంతో మృతిచెందడానికి నీవే కారణమని మాధవిని నిందిస్తూ అత్త సూటిపోటి మాటలతో వేధించింది. దీంతో మనస్తాపానికి గురైన మాధవి సోమవారం రాత్రి అందరూ పడుకున్న తరువాత ఫ్యాన్కు చున్నీతో ఉరి పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యులు గుర్తించేసరికి మృతి చెందింది. దీంతో కుమార్తె మాధవి మృతదేహం వద్ద తల్లి ఈశ్వరమ్మ కన్నీరుమున్నీరైంది. అత్త వేధింపులతోనే తన కుమార్తె అఘాయిత్యానికి పాల్పడిందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదుచేసింది. సీఐ వినోద్బాబు, ఎస్ఐ కామేశ్వరరావు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తహసీల్దారు రవిచంద్ర సమక్షంలో శవపంచనామా నిర్వహించారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ కామేశ్వరరావు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Updated Date - 2022-08-17T04:39:51+05:30 IST