రెండు రోజుల్లో దక్షిణ కోస్తాకు నైరుతి
ABN, First Publish Date - 2022-06-10T08:39:27+05:30
అరేబియా సముద్రంలో పడమర గాలులు బలపడ్డాయి. ఇంకా రుతుపవన మేఘాలు దక్షిణ భారతంపైకి వస్తున్నాయి.
విశాఖపట్నం, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): అరేబియా సముద్రంలో పడమర గాలులు బలపడ్డాయి. ఇంకా రుతుపవన మేఘాలు దక్షిణ భారతంపైకి వస్తున్నాయి. దీంతో రాబోయే 48 గంటల్లో కోస్తాలోని అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. ఈ ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో అంటే ఈ నెల 11వ తేదీకల్లా దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా మధ్య అరేబియా సముద్రం, గోవా, దక్షిణ మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని పేర్కొంది. ఆ తర్వాత 13కల్లా ఏపీలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది. కాగా గురువారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాలు, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో పలుచోట్ల వడగాడ్పులు వీచాయి. అమరావతి, విజయవాడల్లో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Updated Date - 2022-06-10T08:39:27+05:30 IST