జనాలు పిచ్చోళ్లనుకుని జగన్ ఏవేవో పిట్ట కథలు చెబుతున్నారు: రఘురామ
ABN, First Publish Date - 2022-05-24T19:53:01+05:30
సీఎం జగన్ ముందస్తు ప్రణాళికలో భాగంగానే లండన్ వెళ్లారని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. జగన్ లండన్లో సొంత కార్యక్రమాలు చక్కబెట్టుకున్నారన్నారు.
న్యూఢిల్లీ : సీఎం జగన్ ముందస్తు ప్రణాళికలో భాగంగానే లండన్ వెళ్లారని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. జగన్ లండన్లో సొంత కార్యక్రమాలు చక్కబెట్టుకున్నారన్నారు. జనాలు పిచ్చోళ్లనుకుని ఏవేవో పిట్ట కథలు చెబుతున్నారన్నారు. దావోస్కి వెళ్లి జగన్ సాధించింది ఏమీ లేదన్నారు. దావోస్లో ఏపీ ఆరోగ్య రంగం గురించి అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఇంకా రఘురామ మాట్లాడుతూ.. ‘‘నాపై అనర్హత పిటిషన్కు సంబంధించి ప్రివిలేజ్ కమిటీ ముందు చీఫ్ విప్ మార్గాని భరత్ చెప్పిన వాటిలో పస లేదు. జగన్ను నేను ఎప్పుడూ తూలనాడలేదు. పార్టీకి వ్యతిరేకంగా నేను ఎప్పుడూ మాట్లాడలేదు. ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించడం తప్పు కాదు. ఒరిజినల్ వీడియోలను ప్రివిలేజ్ కమిటీకి అందజేశా. నిజాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయి. పార్టీ అధ్యక్షుడిగా జగన్ ఇచ్చిన వాగ్దాలనాలను సీఎంగా ఉల్లంఘిస్తున్నారు. అందుకే జగన్ తప్పులను ఎత్తి చూపా. ఇందులో తప్పు లేదు. ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీలను గుర్తు చేయడం ఎలా తప్పవుతుందో చెప్పాలి. నాకెప్పుడూ విప్ జారీ చేయలేదు. వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు అనర్హులు కారా? పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతున్నట్టు జగన్ వ్యవహరిస్తున్నారు. హత్య కేసులో ఇరుక్కున్న ఎమ్మెల్సీ అనంతబాబును వెంటనే బర్తరఫ్ చేయాలి. చంపిన తరువాత అనంతబాబు కొట్టినట్టు పోలీస్ అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉంది. అనంత బాబు ప్రాణాలకు ముప్పు ఉంది. జాగ్రత్తగా ఉండాలి’’ అని సూచించారు.
Updated Date - 2022-05-24T19:53:01+05:30 IST