Minister Ambati: గుండ్లకమ్మ ప్రాజెక్టు విషయంలో అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారు
ABN, First Publish Date - 2022-09-03T17:11:50+05:30
గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కూరుకుపోవడం వల్ల నీరు సముద్రంలోకి వెళ్ళిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు
ప్రకాశం జిల్లా (Prakasam Dist.): గుండ్లకమ్మ ప్రాజెక్టు (Gundlakamma project) గేటు కూరుకుపోవడం వల్ల నీరు సముద్రంలోకి వెళ్ళిందని మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) అన్నారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నీటి ప్రవాహం అధికంగా ఉండటం వల్ల రెండు రోజుల నుంచి స్టాప్ లాక్ ఏర్పాటు చేయలేక పోయామన్నారు. కొన్ని గేట్లు బాగోలేవని ఇప్పటికే నివేదిక ఇవ్వటంతో రిపేర్ల కోసం అనుమతి ఇచ్చామని, గేట్లు బాగుచేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. అవసరమైతే నాగార్జున సాగర్ నీటితో రిజర్వాయర్ నింపుతామన్నారు. కొందరు కావాలనే అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని, ఐదారేళ్ళ నుంచి తుప్పు పట్టడం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు.
రెండు గేట్లు బాగోలేకపోవటంతో ఇప్పటికే స్టాప్ లాక్స్ ఏర్పాటు చేశామని మంత్రి అంబటి చెప్పారు. గత ప్రభుత్వం డ్యాం సేఫ్టీ కోసం రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. రాజకీయంగా ఈ విషయాన్ని వాడుకోవాలని చూడటం సరైనది కాదన్నారు. చంద్రబాబు విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. గత ప్రభుత్వం డ్యాంలను అశ్రద్ధ చేయటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పుడు గుండ్లకమ్మలో ఉన్న 3.4 టీయంసీ నీటిలో 2 టీయంసీలు సముద్రంలో విడుదల చేయక తప్పదన్నారు. పులిచింతలలో కూరుకుపోయిన గేట్లు రిపేర్ చేస్తున్నామని, రాష్ట్రంలో అన్నీ ప్రాజెక్టులలో గేట్లు రిపేర్లలో ఉన్న మాట వాస్తవమన్నారు. అన్నీ డ్యాంల సేఫ్టీ పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అంబటి రాంబాబు అన్నారు.
Updated Date - 2022-09-03T17:11:50+05:30 IST