జగనన్న లే‘అవుట్’
ABN, First Publish Date - 2022-09-13T06:40:13+05:30
నివాసయోగ్యం కాని చోట్ల జగనన్న కాలనీ లేఅవుట్లు వేసిన అధికారులు ఇప్పుడు కళ్లుతెరిచారు. వాటిలో ఇళ్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ససేమిరా అనడంతో తప్పును సరిదిద్దుకునే పనిలో పడ్డారు.
అధికారుల అనాలోచిత నిర్ణయం
నాడు నివాసయోగ్యం కానిచోట ఇళ్ల పట్టాలు
నిర్మాణానికి ముందుకు రాని లబ్ధిదారులు
ఊళ్లపాలెంలో 356, కనుమళ్లలో 53 ఇళ్లు రద్దు
చదును కోసం పెట్టిన ఖర్చు రూ.65లక్షలు వృథా
సింగరాయకొండ, సెప్టెంబరు 12 : నివాసయోగ్యం కాని చోట్ల జగనన్న కాలనీ లేఅవుట్లు వేసిన అధికారులు ఇప్పుడు కళ్లుతెరిచారు. వాటిలో ఇళ్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ససేమిరా అనడంతో తప్పును సరిదిద్దుకునే పనిలో పడ్డారు. మంజూరు చేసిన ఇళ్లను రద్దు చేస్తున్నారు. ఇప్పటికే సింగరాయకొండలోని ఊళ్లపాలెం లేఅవుట్లో 356, కనుమళ్లలో 53 గృహాలను రద్దు చేశారు. దీంతో ఈ రెండు ప్రాంతాల్లోని లేఅవుట్ల చదునుకు వెచ్చించిన రూ.65లక్షల ప్రజాధనం వృథా అయ్యింది.
ప్రభుత్వ ఒత్తిడితో హడావుడిగా లేవుట్లు
ప్రభుత్వ ఒత్తిడితో జగనన్న కాలనీలకు స్థలాల ఎంపిక విషయంలో అధికారులు అనాలోచితంగా వ్యవహరించారు. నివాసయోగ్యం కానివి, ముంపునకు గురయ్యే ప్రాంతాలు, తాగునీటి వసతి లేనిచోట్ల హడావుడిగా లేఅవుట్లు వేశారు. అక్కడ ఇళ్ల నిర్మాణం సాధ్యం కాదని ప్రజలు నెత్తీనోరు బాదుకుంటున్నా వినిపించుకోకుండా పట్టాలు ఇచ్చారు. ఏళ్లు గడిచినా, అధికారులు వెంటపడుతున్నా లబ్ధిదారుల నుంచి స్పందన కరువైంది. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి వారు ససేమిరా అన్నారు. దీంతో చేసేది లేక ఆ గృహాలను రద్దుచేస్తున్నారు.
ఊళ్లపాలెం వద్ద ఉప్పుపొరలో పట్టాలు
సింగరాయకొండ మండలంలోని ఊళ్లపాలెంలో సముద్రానికి దగ్గరలోని ఉప్పు పొరలో జగనన్న కాలనీ లేఅవుట్ వేశారు. అక్కడ 356 మందికి ప్లాట్లు కేటాయించి పట్టాలు ఇచ్చారు. పోటు వచ్చినప్పుడు సముద్రపు నీరు ఆ కాలనీలోకి వస్తోంది. అంతేకాకుండా వర్షాలు కురిసినప్పుడు భారీగా నీరు నిల్వ ఉంటోంది. లెవలింగ్ చేసిన తరువాత కూడా రోడ్డు కంటే దాదాపు 3 అడుగులు పల్లంలో ఆ లేఅవుట్ ఉంది. దీంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు ముందుకు రాకపోవడంతో అది నిరుపయోగంగా మారింది. ఇక్కడ భూమి లెవలింగ్కి రూ.46.50 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఖర్చుచేశారు. దీంతోపాటు ప్లాట్లు వేయడానికి మరికొంత వెచ్చించారు. ప్రభుత్వ నిధులు దారపోసినా ఇళ్ల నిర్మాణానికి ఆమోదయోగ్యం కాక లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో గృహ నిర్మాణశాఖ అధికారులు ఊళ్లపాలెం లేఅవుట్లో మంజూరు చేసిన గృహాలను పూర్తిగా రద్దు చేశారు.
కనుమళ్లలో ఇళ్ల నిర్మాణానికి ముందుకురాని లబ్ధిదారులు
కనుమళ్ల పంచాయతీ పరిధిలోని చెరువు సమీపంలో జగనన్న లేఅవుట్ వేశారు. అందులో 178 ప్లాట్లను లబ్ధిదారులకు ఇచ్చారు. ఈ లేవుట్ చెరువుకు ఒడ్డున, పంట కాలువకు పక్కనే ఉంటుంది. చెరువులోకి భారీగా నీరు వస్తే అది ముంపునకు గురవుతోంది. పక్కనే పంట కాలువ ఉండటంతో కాలనీలోకి రాకపోకలకు కూడా ఇబ్బందిగా మారింది. దీంతో లబ్ధిదారులు నిర్మాణాలకు ఆసక్తి చూపడం లేదు. కనుమళ్ల లేఅవుట్లో అధికారులు నివాసానికి ఆమోదయోగ్యం కాదని 53 గృహాలను రద్దు చేశారు. మరో 78 కూడా ఇళ్ల నిర్మాణాలకు అనుకూలంగా లేకపోవడంతో లబ్ధిదారులు వెనుకంజ వేస్తున్నారు. ఈ లేఅవుట్లో లెవలింగ్కు రూ.18.50 లక్షలు ఖర్చుచేశారు. ఈ మొత్తం బూడిదలో పోసిన పన్నీరయ్యింది.
పాకలలోనూ మొదట ముంపు ప్రాంతంలో లేఅవుట్
పాకలలో మొదట ముంపు ప్రాంతమైన ఉప్పుపంటను సాగుచేసుకునే భూముల్లో 448 ప్లాట్లతో లేఅవుట్ వేశారు. ఆతర్వాత కొద్దిరోజులకే కురిసిన వర్షానికి ఆభూమి చెరువును తలపించింది. ఆటుపోట్లు వచ్చినప్పుడు సముద్రపు నీరు ఈ లేఅవుట్లో చేరుతోంది. ఇక్కడ స్థలాలు మాకొద్దు బాబోయ్ అంటూ లబ్ధిదారులు అధికారులకు మొరపెట్టుకున్నారు. దీంతో ప్రత్యామ్నాయంగా 12.73 ఎకరాల ప్రైవేటు స్థలాన్ని రూ.1.80 కోట్లకు కొనుగోలు చేసి మరో లేఅవుట్ వేశారు. దీంతో మొదట ముంపు ప్రాంతంలోని లేఅవుట్ అభివృద్ధికి ఖర్చు పెట్టిన ప్రభుత్వ సొమ్ము వృథా అయ్యింది.
అనుకూలమైన చోట్ల స్థలాలు ఇవ్వాలి
ఊళ్లపాలెం, కనుమళ్లలో నివాసానికి అనుకూలంగా ఉండే చోట ఇంటి స్థలాలను ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు. అధికారులు ముంపు ప్రాంతాలు, నివాసానికి వీలుకాని చోట్ల పట్టాలు ఇవ్వడం వల్ల ఇళ్లు నిర్మించుకోలేకపోతున్నామని వాపోతున్నారు. వెంటనే ప్రత్యామ్నాయం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Updated Date - 2022-09-13T06:40:13+05:30 IST