గుండ్లకమ్మ వాగుపై కూలిన చప్టా
ABN, First Publish Date - 2022-12-19T23:15:42+05:30
తర్లుపాడు నుంచి కంభం వెళ్లే రహదారిలో బొడిచర్ల వద్ద గుండ్లకమ్మ వాగుపై నిర్మించిన చప్టా కూలింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
తర్లుపాడు, డిసెంబరు 19: తర్లుపాడు నుంచి కంభం వెళ్లే రహదారిలో బొడిచర్ల వద్ద గుండ్లకమ్మ వాగుపై నిర్మించిన చప్టా కూలింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. బొడిచర్ల వద్ద ఉన్న గుండ్లకమ్మ వాగుపై 50 సంవత్సరాల క్రితం చప్టా నిర్మించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతులు చేసిన దాఖలాలు లేవు. ఇటీవల కురిసిన వర్షాలకు గుండ్లకమ్మ ఉధృతంగా ప్రవహించింది. దీంతో అక్కడక్కడ పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఒక్కసారిగా చప్టా కూలిపోయింది. దీంతో తర్లుపాడు- బొడిచర్ల, కంభం, సూరేపల్లి, మిట్టమీదపల్లెకు వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణి కులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుం ఓ వైపుగా ద్విచక్ర వాహనదారులు వెళుతున్నారు. ఆటోలు, కార్లు సైతం ప్రస్తుతం ఈ వంతెనపై వెళ్లే పరిస్థితి లేదు. ఇక రాత్రి వేళలో ఎవరైనా ఈ గొయ్యి గురించి తెలియక వేగంగా వెళితే అమాంతం గుండ్లకమ్మ నదిలో పడిపోయే ప్రమాదం ఉంది. తక్షణమే అధికారులు వాహనచోదకులను అప్రమత్తం చేయడంతోపాటు వంతెనకు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ రహదారికి ప్రత్యామ్నాయంగా తర్లుబాడు నుంచి బొడిచర్ల రావాలంటే మార్కాపురం నుంచి కంభం మీదగా రావాల్సి ఉంది. దీంతో ఇంచుమించు 50 కిలోమీటర్లు ఉంటుంది.
Updated Date - 2022-12-19T23:15:44+05:30 IST