చింతామణి నాటకం రద్దుపై హైకోర్టులో పిటిషన్
ABN, First Publish Date - 2022-01-31T19:24:33+05:30
చింతామణి నాటకం రద్దుపై ఏపీ హైకోర్టులో ఆర్టిస్ట్ అరుగు త్రినాథ్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం నిర్ణయంతో ఆర్టిస్టులు రోడ్డునపడ్డారని లాయర్ శ్రావణ్ కుమార్ తెలిపారు.
అమరావతి: చింతామణి నాటకం రద్దుపై ఏపీ హైకోర్టులో ఆర్టిస్ట్ అరుగు త్రినాథ్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం నిర్ణయంతో ఆర్టిస్టులు రోడ్డునపడ్డారని లాయర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. అత్యవసర పిటిషన్గా స్వీకరించాలని శ్రావణ్ కుమార్ కోరారు. ఈ పిటిషన్ను మంగళవారం ఏపీ హైకోర్టు విచారించనుంది.
ఇటీవల చింతామణి నాటక ప్రదర్శనను నిషేధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 7ని సవాల్ చేస్తూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. నాటక ప్రదర్శనను నిషేధిస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరారు. వ్యభిచార వృత్తికి వ్యతిరేకంగా సామాజిక సంస్కర్త కళ్లకూరి నారాయణరావు చింతామని నాటకాన్ని రచించారని, వందేళ్లకుపైగా నాటకాన్ని ప్రదర్శిస్తున్నారని, దీనిపై వేలమంది కళాకారులు జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. నాటక ప్రదర్శనను నిలిపివేస్తే కళాకారులు రోడ్డున పడతారని పేర్కొన్నారు. నాటకంలోని ఒక పాత్ర కారణంగా మొత్తం నాటక ప్రదర్శనపై నిషేధం విధించడం అనాలోచిత చర్య అని, వీటిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ జీవోను రద్దు చేయాలని ఆ వ్యాజ్యంలో కోరారు.
ఏపీలో చింతామణి నాటకంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎక్కడా చింతామణి నాటకాన్ని ప్రదర్శించకూడదని ఆదేశాలు జారీ చేసింది.
Updated Date - 2022-01-31T19:24:33+05:30 IST