‘రెండేళ్లు బార్లకు అనుమతించిన జగన్... మద్య నిషేధం ఎలా చేస్తారు?’
ABN, First Publish Date - 2022-07-13T18:04:32+05:30
కొత్త బార్ పాలసీ ద్వారా 800 బార్లకు రెండేళ్లు అనుమతించిన జగన్ రెడ్డి మద్యనిషేధం ఎలా చేస్తారని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ప్రశ్నించారు.
అమరావతి: కొత్త బార్ పాలసీ ద్వారా 800 బార్లకు రెండేళ్లు అనుమతించిన జగన్ రెడ్డి (Jagan reddy)మద్యనిషేధం ఎలా చేస్తారని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ( Eluru sambashiva rao) ప్రశ్నించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... మద్యంలో విష రసాయనాలు ఉన్నాయని తాము బయటపెట్టిన నివేదికపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మద్యం తయారు చేయించేది జగన్, ప్యాపారం చేయించేది ప్రభుత్వం, అమ్మేది వైకాపా కార్యకర్తలు అని ఆరోపించారు. ముఖ్యమంత్రే మద్యం వ్యాపారం చేయటం ప్రజలు చేసుకున్న దురదృష్టమన్నారు. ఎంపిక చేసుకున్న కొంతమంది బినామీలతో మద్యం వ్యాపారం చేయిస్తూ, ఆ డబ్బునే తిరిగి ఎన్నికల్లో ఖర్చు చేయనున్నారని తెలిపారు. మొబైల్ బెల్టుషాపులు పెట్టి మరీ మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారని మండిపడ్డారు. దేశం మొత్తానికి మాదకద్రవ్యాల సరఫరా ఏపీ నుంచే జరుగుతోందన్నారు. వాటాల్లో తేడాలొచ్చే కేసులు బయటకు వస్తున్నాయని ఏలూరు సాంబశివరావు పేర్కొన్నారు.
Updated Date - 2022-07-13T18:04:32+05:30 IST