ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయాలి
ABN, First Publish Date - 2022-05-23T05:05:00+05:30
దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను అమానుషంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయాలని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా రవికుమార్ డిమాండ్ చేశారు.
కోవూరు, మే 22 : దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను అమానుషంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయాలని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా రవికుమార్ డిమాండ్ చేశారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఆదివారం టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులపై ఇటీవల దాడులు ఎక్కువ అవుతున్నాయని చెప్పారు. అడ్డు వచ్చిన దళితులను హత్య చేసి వైసీపీ నాయకులు ప్రతీకారం తీర్చుకుంటున్నారని చెప్పారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసిన అనంతబాబును శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్ రాజుపై దాడి చేసిన డీఎస్పీ అప్పలరాజుపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఆందోళనలో టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు ముసలి సుధాకర్, చెరుకూరి మహేష్, టీడీపీ నాయకులు మల్లారెడ్డి, యద్దనపూడి నాగరాజు, బాలరవి, నగేశ్వరరావు, చౌదరి, శేఖర్, బెల్లంకొండ విజయ్, పాటూరు ప్రసాద్ పాల్గొన్నారు.
ఆత్మకూరు : వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు, హత్యలు ఎక్కువయ్యాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దావా పెంచలరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కాకినాడ దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యా ఘటనపై నిందితులను అరెస్ట్ చేసి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెస్ రాజుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ సెల్ పట్టణ, రూరల్ అధ్యక్షులు ఉదయగిరి సుధాకర్, జువ్విగుంట చినకొండయ్య, తెలుగు యువత నాయకులు కొండ ఓంకార్, ఎల్ ప్రసాద్, ఎం గోపాల్ పాల్గొన్నారు.
Updated Date - 2022-05-23T05:05:00+05:30 IST