మానవత్వం చాటుకున్న ఎస్పీ
ABN, First Publish Date - 2022-06-24T06:19:15+05:30
ప్రమాదంలో గాయపడిన మహిళను ఎస్పీ ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.
సంగం, జూన్ 23: ప్రమాదంలో గాయపడిన మహిళను ఎస్పీ ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. ఉడ్హౌస్పేట గ్రామానికి చెందిన దొడ్ల రాజమ్మ అనే వితంతు ఆటోలో తరుణవాయి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసి తిరిగి అదే ఆటోలో బయలుదేరింది. ఉడ్ హౌస్పేట గ్రామంలోకి క్రాస్ అయ్యే సమయంలో వెనుక వైపు నుంచి కారు ఢీకొట్టి వెళ్లింది. దీంతో ఆటోలో వెనుక కూర్చున్న రాజమ్మ రోడ్డు మీద పడి రెండు కాళ్లు విరిగాయి. అదే సమయంలో ఎన్నికల పరిశీలన నిమిత్తం నెల్లూరు నుంచి ఆత్మకూరు వెళుతున్న ఎస్పీ విజయరావు గమనించి తన కాన్వాయ్ నిలిపి కారు దిగి మహిళ పరిస్థితి గమనించి 108లో వైద్యశాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఢీకొట్టిన కారు ఆచూకీ కోసం ఆత్మకూరు, ఏయస్పేట పోలీసులకు ఆదేశించారు. దీంతో డీసీపల్లి వద్ద కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో స్థానికులతోపాటు సంఘటనలో ఉన్న ప్రజలు, తరుణవాయి సర్పంచు శోభా బాలనాయుడు ఎస్పీ విజయరావుకు కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - 2022-06-24T06:19:15+05:30 IST