పర్యాటకులతో పోటెత్తిన సాగరతీరం
ABN, First Publish Date - 2022-05-16T03:58:02+05:30
జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలతో ఆదివారం తోటపల్లిగూడూరు మండలం కోడూరు సముద్రతీరం పోటెత్తింది.
తోటపల్లిగూడూరు, మే 15 : జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలతో ఆదివారం తోటపల్లిగూడూరు మండలం కోడూరు సముద్రతీరం పోటెత్తింది. దీంతో సందడి వాతావరణం నెలకొంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తీరానికి తరిలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం చీకటిపడే వరకు ప్రజల రాకపోకలు సాగడం విశేషం. కుటుంబాల సమేతంగా కదలివచ్చి తీరం వెంబడి సందడి చేశారు. అసలే వేసవి సెలవులు కావడంతో ముఖ్యంగా యువత ఆటపాటలు, అల్లర్లతో సందడి చేసింది. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు సంభవించకుండా తీరం వెంబడి ఎస్ఐ కె.ఇంద్రసేనారెడ్డి తన సిబ్బందితో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. గతంలో సంభవించిన ప్రమాదాల దృష్ట్యా పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. సముద్రంలో లోతుకు వెళ్లనీయకుండా అప్రమత్తం చేశారు. అయితే సముద్రతీరంలో నిర్మించిన రిసార్ట్ నేటికీ ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడంతో పర్యాటకులు అసౌకర్యాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
Updated Date - 2022-05-16T03:58:02+05:30 IST