విజయవాడ ఆస్పత్రి ఘటనపై చర్యలకు మంత్రి రజిని ఆదేశాలు
ABN, First Publish Date - 2022-04-22T17:54:21+05:30
నగరంలోని ప్రభుత్వాస్పత్రిలో యువతిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై మంత్రి విడదల రజిని స్పందించారు.
విజయవాడ: నగరంలోని ప్రభుత్వాస్పత్రిలో యువతిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై మంత్రి విడదల రజిని స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ తరఫున సత్వర చర్యలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం మీడియాతో మంత్రి మాట్లాడుతూ విజయవాడ ఘటనలో ఇప్పటికే సీఎస్ ఆర్ఎంఓకు షోకాజ్ నోటీసు జారీ శామని చెప్పారు. నిందితులు ఫాగింగ్ ఏజెన్సీకి చెందిన కార్మికులుగా గుర్తించామని, వారిని వెంటనే విధుల నుంచి తొలగిస్తున్నట్టుగా ఉత్తర్వులు ఇచ్చామని తెలిపారు. సెక్యూరిటీ ఏజెన్సీకి, ఫాగింగ్ ఏజెన్సీకి టెర్మినేషన్ నోటీసులు ఇచ్చామని అన్నారు. ఘటనకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ పరంగా పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపుల్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ ఘటన అంత్యంత బాధాకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు సత్వరమే చర్యలు తీసుకుంటున్నామని మంత్రి విడదల రజిని తెలిపారు.
Updated Date - 2022-04-22T17:54:21+05:30 IST