వరములనీయవమ్మా..మా లక్ష్మీ
ABN, First Publish Date - 2022-08-20T05:25:49+05:30
శ్రీశైలంలో శ్రావణమాసం నాలుగో శుక్రవారం పురస్కరించుకుని దేవస్థానం ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించింది.
శ్రీశైలం, ఆగస్టు 19: శ్రీశైలంలో శ్రావణమాసం నాలుగో శుక్రవారం పురస్కరించుకుని దేవస్థానం ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించింది. ఆలయ ఉత్తర ద్వారం ఎదురుగా ఉన్న చంద్రావతి కల్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పరోక్ష సేవల ద్వారా 59 మంది భక్తులు వరలక్ష్మీ వ్రతాన్ని జరిపించుకున్నారు. ఈ వ్రతంలో 300 మందికి పైగా చెంచు మహిళలు, 200 మంది ఇతర మహిళలు పాల్గొన్నారు. వ్రతానికి కావలసిన పూజాద్రవ్యాలను దేవస్థానం సమకూర్చింది. పూజల్లో పాల్గొన్న మహిళలందరికీ అమ్మవారి రవికగుడ్డ, పూలు, గాజులు, కైలాస కంకణాలు, శ్రీశైలప్రభ మాసపత్రిక, ప్రసాదం అందజేశారు. చెంచు మహిళలకు ప్రత్యేకించి చీరలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి లవన్న దంపతులతోపాటు, ధర్మకర్తల మండలి సభ్యులు మఠం విరూపాక్షయ్యస్వామి, ఐ.టీ.డీ.ఏ ప్రాజెక్ట్ అఫీసర్ బి. రవీంద్రారెడ్డి దంపతులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-20T05:25:49+05:30 IST