జవాబుదారీతనం ఉండాలి
ABN, First Publish Date - 2022-09-04T05:05:09+05:30
‘స్పందన’ దరఖాస్తులకు మొక్కుబడిగా ఎండార్స్మెంట్ ఇచ్చి క్లోజ్ చేయవద్దని... జవాబుదారీగా వ్యవహరించాలని కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ అధికారులను హెచ్చరించారు.
‘స్పందన’ అర్జీలపై శ్రద్ధ పెట్టండి: కలెక్టర్
నంద్యాల టౌన్, సెప్టెంబరు 3 : ‘స్పందన’ దరఖాస్తులకు మొక్కుబడిగా ఎండార్స్మెంట్ ఇచ్చి క్లోజ్ చేయవద్దని... జవాబుదారీగా వ్యవహరించాలని కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ అధికారులను హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆర్డీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘స్పందన’ అర్జీల విషయంలో ఆలసత్వం ప్రదర్శించకుండా వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. నంద్యాల జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు స్పందనకు దాదాపు 8వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. వీటిలో 4వేల అర్జీలు రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉన్నాయని అన్నారు. చాలా మంది అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించకుండా... అవసరమైన డాక్యుమెంట్లు తెప్పించుకోకుండా మొక్కుబడి రీతిలో పనిచేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందన అర్జీలను కింది స్థాయి సిబ్బందికి ప్రతిపాదనలు చేయకుండా స్వయంగా అధికారులే పరిశీలించి స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలని ఆదేశించారు. స్పందన కేసులపై మండలాల వారీగా రిపోర్టులు సేకరించి సమర్పించాలని డీఆర్వో పుల్లయ్యను ఆదేశించారు.
Updated Date - 2022-09-04T05:05:09+05:30 IST