భవిష్యత్ తిరగరాసేది గురువే: కలెక్టర్
ABN, First Publish Date - 2022-08-11T05:23:20+05:30
విద్యార్థుల భవిష్యత్ తిరగరాసేది గురువు మాత్రమేనని కలెక్టర్ కోటేశ్వరరావు అన్నారు. బుధవారం గోరంట్ల గ్రామంలో కలెక్టర్ పర్యటించారు.
కోడుమూరు (రూరల్), ఆగష్టు 10: విద్యార్థుల భవిష్యత్ తిరగరాసేది గురువు మాత్రమేనని కలెక్టర్ కోటేశ్వరరావు అన్నారు. బుధవారం గోరంట్ల గ్రామంలో కలెక్టర్ పర్యటించారు. ముందుగా ఆయన స్థానిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. మెనూలో భాగంగా వడ్డించిన పదార్థాలను పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులతో, కలెక్టర్ ముచ్చటిస్తూ మెనూ ప్రకారం వడ్డిస్తున్నారా అంటూ ఆరా తీశారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులతో విడివిడిగా సమావేశమై మాట్లాడారు. హైస్కూల్ స్థాయిలో విద్యార్థులను బాగా తీర్చిదిద్దాలని, మార్గదర్శకులుగా ఉండాలని ఉపాధ్యాయులకు సూచించారు. కలెక్టర్ పాఠశాల పరిసరాలు పరిశీలించి పలు సూచనలు చేశారు. హెచ్ఎం వినతి మేరకు గదుల నిర్మాణానికి ఇబ్బందిగా ఉన్న ట్రాన్స్ఫారం తొలగించేలా అధికారులతో మాట్లాడి పరిష్కారం చేస్తామన్నారు. అనంతరం కలెక్టర్ గ్రామంలో సచివాలయాలను తనిఖీ చేశారు. వివిధ రికార్డులు పరిశీలించి, వ్యాక్సిన్ వివరాలపై ఏఎన్ఎంలను అడిగి తెలుసుకున్నారు. సచివాలయ సిబ్బంది విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శేషఫణి, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంఈవో అనంతయ్య, హెచ్ఎం వీరేశప్ప, సర్పంచ్ సద్దల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-11T05:23:20+05:30 IST