ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
ABN, First Publish Date - 2022-02-22T05:45:31+05:30
స్థానిక గ్రంథాలయంలో అంత ర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
నంద్యాల(నూనెపల్లె), ఫిబ్రవరి 21: స్థానిక గ్రంథాలయంలో అంత ర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ శాఖాధికారి బషీర్ అహమ్మద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ప్రముఖ రచయిత, ఉపాధ్యాయుడు అన్నెం శ్రీనివాసరెడ్డి, అధ్యాపకుడు మహమ్మద్ రఫీ తదితరులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగుతల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పాఠకులకు సుమతి శతకం పుస్తకాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు భాష ప్రాచీన భాష అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ తెలుగు భాషలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు నడపాలని ఆకాంక్షించారు.
నంద్యాల(కల్చరల్): స్థానిక ఎన్జీవో హోంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నంద్యాల సాహితీ స్రవంతి సంస్థ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసమూర్తి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శతకపద్య పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమం లో తెలుగు పండిట్ అన్నెం శ్రీనివాస రెడ్డి, మాబుబాషా, నీలకంఠమాచారి, ప్రసాద్, రోటరీ డీవీ సుబ్బయ్య, డాక్టర్ రమణమూర్తి,మణిశేఖర్ రెడ్డి, నరసారెడ్డి, రఫి, సాహితీ ప్రియులు పాల్గొన్నారు.
శిరివెళ్ల: మాతృభాష తెలుగును మరువరాదని శిరివెళ్ల జడ్పీ ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం ఇబ్రహీం అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాల వేసి సోమవారం నివాళి అర్పించారు. విద్యార్థులకు పాఠశాలస్థాయి నుంచే మాతృభాషలో విద్యాబోధన జరగాలన్నారు. అనంతరం మాతృభాషలోని మాధుర్యాన్ని పద్యాలు, కథలతో విద్యార్థులకు వివరించి పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు మాబుబాషా, చంద్రలీల, సుందరయ్య, ప్రసాద్, రాజమ్మ, సుజాత, కృష్ణారావు హెల్డా పాల్గొన్నారు.
ఆళ్లగడ్డ: తెలుగు భాష కమ్మని భాష అని విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు గోవిందరాజులు అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం పురస్కరించుకొని పడకండ్లలో నివసిస్తున్న విశ్రాంత తెలుగు పండితుడు గోవిందరాజులును శిష్యులు అమీర్బాషా, రామచంద్రారెడ్డి శాలువ పూలమాలలతో సన్మానించారు. అనంతరం తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
గడివేముల: దేశభాషలందు తెలుగుభాష గొప్పదని గని హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని గని గ్రామంలో సోమవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించారు. తెలుగుభాషపై నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. తెలుగు భాషకు కృషి చేసిన ఉపాధ్యాయులు లక్ష్మయ్య, మహబూబ్బాషాలను సన్మానించారు. కార్యక్రమంలో శేషమరాజు, సుకన్న, సూర్యప్రకా్షరెడ్డి, రవినాయక్, వసంతనాయక్ పాల్గొన్నారు.
Updated Date - 2022-02-22T05:45:31+05:30 IST