పనులను వేగవంతం చేయండి: ఎంపీ
ABN, First Publish Date - 2022-01-29T05:00:44+05:30
కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరైన పనులను వేగవంతం చేయాలని జిల్లా దిశ కమిటీ చైర్మన్ కర్నూలు ఎంపీ డా.సంజీవ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
కర్నూలు(కలెక్టరేట్), జనవరి 28: కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరైన పనులను వేగవంతం చేయాలని జిల్లా దిశ కమిటీ చైర్మన్ కర్నూలు ఎంపీ డా.సంజీవ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ (కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధులు, అభివృద్ధిపై) అధికారులతో ఆయనతో పాటు ఉపాధ్యక్షుడు నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎంపీ డా.సంజీవకుమార్ మాట్లాడుతూ నగరంలోని వెంకటరమణ కాలనీకి సంబందించి జాతీయ రహదారి ఓవర్ బ్రిడ్జి పనులు ఆలస్యం కావడం వల్ల తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆ పనులను వేగవంతం చేయాలని నేషనల్ హైవే అథారిటీ డీజీఎం సరస్వతిని ఆదేశించారు. ఆ కాలనీలో రోడ్డు ఒడిదుడుకులుగా గుంతలతో ఉందని, వారంలోగా రోడ్డు లెవలింగ్ పనులను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. కర్నూలు మార్కెట్ యార్డులో ఏసీ, నాన్ ఏసీ పనులకు సంబంధించిన నివేదికలు అందజేయాలని మార్కెట్ యార్డు ఏడీని సూచించారు. నేసనల్ రూరల్ డ్రింకింగ్ ప్రోగ్రాం సంబంధించి కోడుమూరు నియోజకవర్గంలో ఈ పథకం కింద చేపట్టిన పనుల వివరాలను అందజేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని ఆదేశించారు. గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి కోడుమూరు పట్టణానికి నీటిని అందించే పనులపై ఆర్డబ్లూఎస్ ఎస్ఈని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కర్నూలు కార్పొరేషన్లో అమృత స్కీం పథకానికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలన్నారు. ఐసీడీఎస్ శాఖ పరిధిలో జిల్లాలో రెండేళ్లలో ఉద్యోగాల నియామకాలపై వివరాలను వారంలోగా తెలియజేయాలని ఐసీడీఎస్ పీడీని ఆదేశించారు. జిల్లా దిశా కమిటీ సమీక్ష సమావేశానికి అధికారులకు నోటీసులు జారీ చేయాలని ఎంపీ డా.సంజీవ్కుమార్ జేసీకి తెలిపారు. బీఎస్ఎన్ఎల్కు సంబంధించి టెలిఫోన్ అడ్వైజర్ మీటింగ్ జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. కర్నూలు నుంచి విజయవాడకు ప్రతి రోజూ ట్రైన్ సదుపాయాన్ని కల్పించేలా దిశా కమిటీ తీర్మానం చేస్తోందన్నారు. కర్నూలు, నంద్యాలలో రైలుకు సంబంధించి ఫిట్లైన్స్ సదుపాయం కల్పించేలా ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని జేసీని ఆదేశించారు. కర్నూలు పార్లమెంటు పరిధిలో దూపాడు దగ్గర ఫిట్లైన్స్ సదుపాయం కోసం ప్రభుత్వ స్థలం కేటాయించాలని, అవసరమైతే భూసేకరణ చేయాలని సూచించారు. కర్నూలు-బళ్లారి ఆర్అండ్బీ రోడ్డు సంబంధించి ప్రపోజల్ రిపోర్టు ఇవ్వాలని ఆర్అండ్బీ ఎస్ఈని ఆదేశించారు. కర్నూలు-గుంటూరు రోడ్డుకు సంబంధించి మరమ్మతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కర్నూలు రైల్వేస్టేషన్లో సెకండ్ గేట్ ఏర్పాటుకు కృషి చేయాలని జేసీని ఆదేశించారు. రెండేళ్ల నుంచి జిల్లా వైద్యఆరోగ్య శాఖ పరిధిలో ఉద్యోగ నియామక వివరాలను తెలియజేయాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిని ఆయన ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మొక్కల పెంపకం, సంరక్షణకు సంబంధించిన వివరాలను అందజేయాలని డ్వామా పీడీని జిల్లా దిశా కమిటి ఉపాధ్యక్షులు నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఆదేశించారు. జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, పాణ్యం, నందికొట్కూరు, కోడుమూరు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, తోగూరు ఆర్థర్, డా.జె.సుధాకర్, జేసీలు మనజీర్ జిలానీ సామూన్,ఎంకేవీ శ్రీనివాసులు, డీఆర్వో పుల్లయ్య, డ్వామా పీడీ అమర్నాథ్ రెడ్డి, జిల్లా దిశా కమిటీ మెంబర్ నరసింహులు, రాజు, మున్సిపల్ చైర్మన్లు ఎంపీపీలు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-29T05:00:44+05:30 IST