శ్రీశైలంలో భక్తుల రద్దీ
ABN, First Publish Date - 2022-08-15T04:28:36+05:30
శ్రీశైల క్షేత్రానికి శ్రావణ మాసం, వరుస సెలవులు రావడంతో భక్తులు పోటెత్తారు. క్షేత్రానికి భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో స్వామివారి గర్భాలయ అభిషేకాలను, వీఐపీ బ్రేక్ దర్శనాలను దేవస్థానం అధికా రులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు.
శ్రీశైలం, ఆగస్టు 14: శ్రీశైల క్షేత్రానికి శ్రావణ మాసం, వరుస సెలవులు రావడంతో భక్తులు పోటెత్తారు. క్షేత్రానికి భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో స్వామివారి గర్భాలయ అభిషేకాలను, వీఐపీ బ్రేక్ దర్శనాలను దేవస్థానం అధికా రులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. రద్దీ దృష్ట్యా భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. అలాగే స్వామివారి సామూహిక అభిషేకం నిర్వహించుకున్న భక్తులకు అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. ఆదివారం వేకువజాము నుంచే భక్తు లు పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఉదయం నుంచే క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. దీంతో స్వామిఅమ్మవార్ల దర్శనానికి సుమారు 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. ఇదిఇలా ఉంటే శ్రీశైలం జలాశయం పది గేట్లు తెరవడంతో దోమలపెంట నుంచి శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జమ్ నెలకొంది. దీంతో వాహనదారులు చంటి పిల్లలు, వృద్ధులతో ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోపక్క జలాశయాన్ని తిలకించేందుకు పర్యాటకులు అధికంగా తరలి రావడంతో డ్యామ్ ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. దీంతో దోమలపెంట నుంచి శ్రీశైలానికి చేరుకోవడానికి వాహనదారులకు దాదాపుగా 4 గంటల సమయం పడుతోంది.
Updated Date - 2022-08-15T04:28:36+05:30 IST