AP News: గర్భిణికి ప్రసవం చేసిన స్వీపర్.. శిశువు మృతి
ABN, First Publish Date - 2022-08-25T01:49:41+05:30
పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన ఓ నిండు గర్భిణికి అందులో పని చేసే స్వీపరే దిక్కయింది. వైద్యురాలి అవతారమెత్తి ప్రసవం చేయడంతో చివరకు శిశువు మృతి చెందింది.
ఓర్వకల్లు: పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన ఓ నిండు గర్భిణికి అందులో పని చేసే స్వీపరే దిక్కయింది. వైద్యురాలి అవతారమెత్తి ప్రసవం చేయడంతో చివరకు శిశువు మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం ఉదయం జరిగింది. బుధవారం వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని కాల్వ గ్రామానికి చెందిన ఓ గర్భిణికి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో గ్రామ ఆశా వర్కర్ సహాయంతో ఓర్వకల్లు ఆసుపత్రికి తెచ్చారు. వైద్యులు ఎవరూ లేకపోవడంతో ఆసుపత్రిలోనే పని చేస్తున్న ఓ స్వీపర్ ప్రసవం చేసింది. మగ బిడ్డ పుట్టి మృతి చెందగా తల్లి మాత్రం క్షేమంగా బయట పడింది. ఆసుపత్రికి వెళ్లగానే గర్భిణి దగ్గరకు వచ్చి పరీక్షలు చేస్తుంటే.. కుటుంబ సభ్యులు డాక్టరేనని భావించారు. అయితే చివరకు ప్రసవం చేసింది స్వీపర్ అని తెలియడంతో గుండెలు బాదుకున్నారు. తాము కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళతామని చెప్పినా ఆ స్వీపర్ ప్రసవం చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో స్వీపర్లే వైద్యుల అవతారమెత్తి చికిత్స చేస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆసుపత్రిలో వైద్యులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - 2022-08-25T01:49:41+05:30 IST