దుర్గగుడిలో అవినీతి రాజ్యం.. మ్యాక్స్ సంస్థ మతలబు బట్టబయలు..!
ABN, First Publish Date - 2022-02-14T17:38:46+05:30
విజయవాడ: ఆలయానికి భద్రత కల్పించాల్సిన ఆ సక్యూరిటీ సంస్థ అలసత్వం ప్రదర్శిస్తోంది.
విజయవాడ: ఆలయానికి భద్రత కల్పించాల్సిన ఆ సక్యూరిటీ సంస్థ అలసత్వం ప్రదర్శిస్తోంది. నిబంధనలను గాలికొదిలేసి ఇష్టారాజ్యంగా నియామకాలు చేపట్టింది. ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లాల్సిన విజయవాడ దుర్గగుడి అక్రమాలకు ఆనవాలంగా మారింది. అన్ని తెలిసి.. చర్యలు తీసుకోవాల్సిన దేవాదాయశాఖ అధికారులు ఉదారంగా వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఓ ఘటనతో మ్యాక్స్ సంస్థ మతలబులు బయటకొచ్చాయి.
బెజవాడ అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రతి రోజు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆలయంలో భద్రతను చూసుకోడానికి మ్యాక్స్ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారు. దుర్గ గుడిలో ఈ సంస్థ తరఫున సెక్యూరిటీ గార్డులుగా అనేకమంది పనిచేస్తున్నారు. అయితే 2019లో అప్పటి పోలీస్ కమిషనర్, దేవాదాయ శాఖ కమిషనర్ కొన్ని నిబంధనలు రూపొందించారు. ఇక్కడ పనిచేయాలంటే టెన్త్ పాస్తోపాటు నివాసం ఉంటున్న స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండాలి. సిబ్బంది వివరాలు పరిశీలించిన తర్వాతే ఉద్యోగాలు ఇవ్వాలని మ్యాక్స్ సంస్థను ఆదేశించారు. గతంలో దుర్గ గుడిలో వెండి సింహాలు మాయం అయిన ఘటనలో మ్యాక్స్ సిబ్బంది నిర్లక్ష్యం ఉందని రుజువైంది. దాంతో అధికారులు ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టారు. అయితే సంస్థ యాజమాన్యం కోర్టుకు వెళ్లి మళ్లీ ఆదేశాలు తెచ్చుకుంది. మొదట్లో ఎన్వోసీ ఉంటేనే ఉద్యోగలు ఇచ్చిన సంస్థ.. ఆ తర్వాత నిబంధనలు ఉల్లంఘిస్తోంది. సిఫార్సులు, వాళ్లు చెప్పినట్లు జీతాలు తీసుకున్నవారిని మాత్రమే నియమిస్తోంది.
Updated Date - 2022-02-14T17:38:46+05:30 IST