Vijayawada నగరవాసులకు Jagan సర్కార్ షాక్..
ABN, First Publish Date - 2022-03-19T06:30:17+05:30
Vijayawada నగరవాసులకు Jagan సర్కార్ షాక్..
- చట్టంతో చెలగాటం
- రద్దయిన చట్టంతో నగరవాసులకు షాక్
- అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ మళ్లీ తెరపైకి!
- మిగులు భూములను ఆక్రమించారంటూ నోటీసులు
- న్యాయపోరాటానికి సిద్ధమవుతున్న ఇళ్ల యజమానులు
- జీవో చెల్లదంటున్న నిపుణులు
‘అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద సీలింగ్ భూమి మీ ఆక్రమణలో ఉన్నదని విచారణలో తేలింది. జీవో ఎం.ఎస్.నెం. 36 ద్వారా ఆక్రమణలో ఉన్న మిగులు భూమిని ఆక్రమణదారులకు కేటాయించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం మీ ఆక్రమణలోని మిగులు భూమిని మీకు కేటాయించేందుకు 27-3-2008కి ముందున్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, కరెంటు బిల్లు, నిర్మాణ అనుమతులు, నీటిపన్ను రశీదు నకళ్లతో ప్రస్తుత రిజిస్ట్రేషన్/బేసిక్ విలువకు ఒకటిన్నర రెట్లు విలువ లెక్కించి, అందులో 50 శాతం నగదును తొలి విడతగా డిమాండ్ డ్రాఫ్ట్ తీసి, సదరు డీడీని దరఖాస్తుకు జతపరిచి మీ పరిధిలోని తహసీల్దారు కార్యాలయంలో 30-6-22లోగా అందజేయగలరు.’
-విజయవాడ నగరంలో సుమారు రెండు వేల మందికి జిల్లా రెవెన్యూ అధికారులు జారీ చేసిన నోటీసు ఇది.
నిధుల లేమితో కటకటలాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా ప్రజలను పీల్చుకుతినేందుకు సిద్ధమైంది. సామాన్య ప్రజలపై ఇప్పటికే పన్నుల భారాలను మోపిన వైసీపీ సర్కార్ తాజాగా ఉనికిలో లేని చట్టంతో ముందుకొచ్చింది. అందులో భాగంగా పట్టణ భూపరిమితుల చట్టం పేరుతో ప్రజలను బాదడం మొదలు పెట్టింది. మిగులు భూముల క్రమబద్ధీకరణకు జీవో నంబరు 36 తీసుకొచ్చింది. ప్రభుత్వ శాఖల అనుమతితో ఎన్నో దశాబ్దాల క్రితం ఇళ్లు నిర్మించుకున్న సామాన్యులు ఇప్పుడు ఆ స్థలాలు చట్టబద్ధం కావంటూ అధికారులు నోటీసులు పంపుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద మిగులు భూముల క్రమబద్ధీకరణ పేరుతో ప్రభుత్వం విజయవాడతోపాటు ఇతర నగరాల్లోని ప్రజలకూ నోటీసులు జారీ చేస్తోంది. ఈ నోటీసుల్లో పేర్కొన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను 2008లోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆ చట్టం కింద జారీ చేసిన నోటీసులకు చట్టబద్ధత ఎలా ఉంటుందని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు.
50 ఏళ్లుగా అక్కడే నివాసం
ఇలా మిగులు భూములుగా గుర్తించినవి విజయవాడ నగర నడిబొడ్డునే ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోని వారంతా 50 ఏళ్లకుపైబడి అక్కడ నివసిస్తున్నారు. వీరిలో ధనికులతోపాటు సామాన్యులూ ఉన్నారు. ఒక్కో చోట స్థలం విలువ ప్రభుత్వ ధర ప్రకారం గజం రూ.90వేల వరకు ఉంది. నోటీసుల్లో పేర్కొన్న విధంగా వారు తమ స్థలాలను క్రమబద్ధీకరించుకోవాల్సి వస్తే గజానికి 1.35 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ రేటు కూడా ఆ స్థాయిలో లేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఉమ్మడిగా న్యాయపోరాటం చేయాలని నోటీసులు అందుకున్న వారు నిర్ణయించుకున్నారు. అసలు ఉనికిలో లేని చట్టం ఆధారంగా తమకు నోటీసులు ఇచ్చి భారీగా డబ్బులు చెల్లించాలని కోరడం ఏమిటని ఇళ్ల యజమానులు ప్రశ్నిస్తున్నారు.
యూఎల్సీ చట్టం ఏమిటి?
‘రాజకీయ ప్రయోజనాల కోసం 1976లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ లోపభూయిష్టమైన అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) చట్టం తెచ్చారు. దాని ముసుగులో దళారులు, పైరవీకారులు, అధికారులు కుమ్మక్కయి పట్టణ భూముల వినియోగంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారు. యూఎల్సీ కింద మిగులు భూములు ఎన్ని ఉన్నాయి? వాటి యజమానులు ఎవరు? ఎంత మిగులు భూమిని స్వాధీనం చేసుకున్నారు? తదితర వివరాలను రిజిస్ట్రేషన్, తహసీల్దారు కార్యాలయాల్లో అందుబాటులో ఉంచలేదు. ఆ భూములను నిషేధిత జాబితాలోకి చేర్చడంలో ఆనాటి పాలకులు పూర్తిగా విఫలమయ్యారు.
ఈ జీవో చెల్లుబాటు కాదు
యూఎల్సీ చట్టం అమలులో ఉన్న లోపాలను గుర్తించిన వాజ్పేయి సర్కార్ 1999లో దాన్ని రద్దు చేసింది. ఈ చట్టం అవినీతి, అక్రమాలకు ఆస్కారం ఇస్తుందని గుర్తించిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1988లోనే దీనికి సవరణ చేసి, జీవో నంబరు 733 ద్వారా గృహనిర్మాణాలకు ఆటంకం కలగకుండా చేశారు. ఆ తర్వాత 2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూఎల్సీ చట్టాన్నే రద్దు చేసింది.. అని యూఎల్సీ యాక్ట్పై సమగ్ర అవగాహన ఉన్న ఉడా మాజీ చైర్మన్ తూమాటి ప్రేమ్నాథ్ ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. అసలు ఉనికిలో లేని చట్టం కింద మిగులు భూమి క్రమబద్ధీకరణ పేరుతో ఇప్పుడు రుసుము చెల్లించాలని కోరడం చట్టపరంగా చెల్లుబాటు కాదని ప్రేమ్నాథ్ స్పష్టం చేశారు. ‘వాస్తవానికి 1976కు ముందు ఇళ్లు నిర్మించుకున్న మిగులు భూములు యూఎల్సీ చట్టం పరిధిలోకి రావు. 1999 రిపీల్ చట్టంలోని 3, 4 సెక్షన్ల ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకోని భూములకు వాటిని అనుభవిస్తున్న వారే యజమానులు. 2008లో జీవో నంబరు 747 ద్వారా గృహ యజమానులు వర్గీకరణ, క్రమబద్ధీకరణకు కట్టాల్సిన రుసుములో పేదలకు కొంత మినహాయింపును అప్పటి ప్రభుత్వం కల్పించింది. ప్రస్తుత ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 36లో అటువంటి వెసులుబాట్లకు మంగళం పాడింది. శ్లాబులను తొలగించి పేదలు, ధనికులు తేడా లేకుండా స్థలాలను కొన్నప్పటి ధరను పరిగణనలోకి తీసుకోకుండా ప్రస్తుత ఆస్తి విలువకు ఒకటిన్నర రెట్లు చెల్లించాలని ఆదేశిస్తోంది. ఇది సామాన్య ప్రజలను నిలువు దోపిడీ చేయడమే.’ అని ప్రేమ్నాథ్ పేర్కొన్నారు. తప్పు ప్రభుత్వం చేసి ఫలితాన్ని ప్రజలు అనుభవించాలనడం సరికాదని, మిగులు భూముల విషయంలో ప్రభుత్వ తీరు న్యాయస్థానాల్లో వీగిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Updated Date - 2022-03-19T06:30:17+05:30 IST