ముందుకు సాగని ‘నాడు-నేడు’ పనులు
ABN, First Publish Date - 2022-01-24T06:07:50+05:30
ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను అభివృద్ధి చేసి, సకల సదుపాయాలను కల్పించటమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన నాడు - నేడు పనులు ముందుకు సాగటం లేదు.
ముసునూరు, జనవరి 23 : ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను అభివృద్ధి చేసి, సకల సదుపాయాలను కల్పించటమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన నాడు - నేడు పనులు ముందుకు సాగటం లేదు. ముసునూరు పీహెచ్సీలో అభివృద్ధి పనులు చేపట్టి ఏడాదైన నేటికి 15శాతం పనులు మాత్రమే పూరైయ్యాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవటంతో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ముసునూరు పీహెచ్సీకి నాడు - నేడు కింద రూ.40లక్షల నిధులు కేటాయించారు. ఎలక్ట్రికల్ వర్క్లు, తలుపులు, ధర్వాజాల ఏర్పాటుతో పాటు, మెగా యోగాహాల్, ఫ్లోరింగ్ నిర్మాణం, మరుగుదొడ్లులో టైల్స్ వేయటం, శిథిలావస్ధకు చేరిన పాత భవనాలకు పూర్తిగా తీసివేయటం, మంచినీటి బోరు, మోటారు ఏర్పాటు చేయాల్సి ఉంది. టాయ్లైట్స్లో టైల్స్, ఎలక్ట్రికల్ సామగ్రి ఏర్పాటు పనులు పూర్తికాగా, కొన్ని తలుపులు మాత్రమే బిగించారు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన నాడు - నేడు పథకానికి నిధులు లేక లోపీహెచ్సీ అభివృద్ధి అమడ దూరంలో ఉండటంతో ప్రభుత్వ పనితీరుపై ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమౌతోంది.
బిల్లులు రాక నిలిచిన పనులు .. రోజాకుమారి, ఆర్అండ్బీ, డీఈ
ముసునూరు పీహెచ్సీలో నాడు - నేడు పనులు నిలిచిపోయిన మాటా వాస్తవమే. పూర్తయిన 15శాతం పనులకు బిల్లులు పెట్టాం. ప్రభుత్వం నుంచి బిల్లులు రాగానే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం.
Updated Date - 2022-01-24T06:07:50+05:30 IST