వరదై పొంగి..
ABN, First Publish Date - 2022-11-05T00:49:08+05:30
ఎటు చూసినా జనమే. అందరి చేతుల్లో పసుపు జెండాలే. తండోపతండాలుగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు, అభిమానులతో నందిగామ, జగ్గయ్యపేట జన సునామీని సాక్షాత్కరించాయి. టీడీపీ అధినేత చంద్రబాబును చూసిన క్షణం నుంచే ఈలలతో... కాబోయే సీఎం అంటూ నినాదాలతో రెండు పట్టణాలు మోతెక్కాయి.
నందిగామ, జగ్గయ్యపేటలలో జనసునామీ
చంద్రబాబు సభకు తండోపతండాలుగా తరలిన జనం
అదుపుచేయలేక చేతులెత్తేసిన పోలీసులు
‘బాదుడే బాదుడు’సభ విజయవంతం
ఎటు చూసినా జనమే. అందరి చేతుల్లో పసుపు జెండాలే. తండోపతండాలుగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు, అభిమానులతో నందిగామ, జగ్గయ్యపేట జన సునామీని సాక్షాత్కరించాయి. టీడీపీ అధినేత చంద్రబాబును చూసిన క్షణం నుంచే ఈలలతో... కాబోయే సీఎం అంటూ నినాదాలతో రెండు పట్టణాలు మోతెక్కాయి. అదుపుచేయలేక పోలీసులు చేతులెత్తేశారు. టీడీపీ కార్యకర్తలు, అభిమానుల జోష్తో చంద్రబాబు పాల్గొన్న బాదుడే బాదుడు సభ దిగ్విజయంగా సాగింది.
నందిగామ, జగ్గయ్యపేట, నవంబరు 4 : ఊహించని రీతిలో తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు సభకు తరలిరావడంతో నందిగామ కిటకిటలాడింది. వీధులన్నీ పసుపు జెండాలు, పచ్చచొక్కాలతో నిండుగా కనిపించాయి. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చంద్రబాబు నందిగామ, జగ్గయ్యపేటలకు వచ్చారు. చంద్రబాబు నందిగామకు సాయంత్రం వస్తారని తెలిసినప్పటికీ మధ్యాహ్నానికే ప్రజలు పట్టణానికి చేరుకున్నారు. సభ గాంధీ సెంటర్లో ఉందని తెలిసినా తమ నేతను చూడాలన్న ఆతృతతో ప్రజలు రైతుపేట జాతీయ రహదారిపై చేరుకొని నిలువుకాళ్లపై గంటల తరబడి వేచి ఉన్నారు. ఒక్కసారిగా తమ నేతను చూసి ఆనందంతో ఆయన కాన్వాయ్పైకి తోసుకొని వెళ్లారు. పోలీసులు, కేంద్ర బలగాలు సైతం ఒక దశలో చేతులెత్తేశాయి. జయహో చంద్రన్న, కాబోయే సీఎం అంటూ నినాదాలతో పట్టణం హోరెత్తింది. ముక్కపాటి నగర్ వద్ద నుంచి గాంధీ సెంటర్కు చేరుకోవడానికి 2.20 గంటలు పట్టింది. అనూహ్యమైన ప్రజాభిమానం చూసిన చంద్రబాబు సైతం ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు.
చేతులెత్తేసిన పోలీసులు
చంద్రబాబు సభకు ఊహించని రీతిలో జనం రావడంతో పోలీసులు చేతులెత్తేశారు. మధ్యాహ్నం మూడు గంటల వరకూ పోలీసుల అదుపులోనే పరిస్థితి ఉన్నప్పటికీ క్షణక్షణం మార్పు వచ్చింది. చంద్రబాబు కాన్వాయ్ బైపాస్ రోడ్డుకు చేరుకుందన్న సమాచారంతో ఒక్క ఉదుటున ప్రజలు కాన్వాయ్ వైపు చొచ్చుకుపోయారు. కొద్ది నిమిషాలపాటు ప్రజలను అడ్డుకోగలిగిన రోప్ పార్టీ, స్పెషల్ పోలీసులు పూర్తిగా చేతులెల్తేశారు. చంద్రబాబు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని సైతం ప్రజలు ఒక దశలో పక్కకు నెట్టారు. అతి కష్టం మీద బాబును కారు నుంచి రోడ్షో వాహనంపైకి ఎక్కించాల్సి వచ్చింది.
అమరావతే ముద్దు అంటూ నందిగామ న్యాయవాదులు చంద్రబాబు రోడ్షోలో బ్యానర్లు పట్టుకొని ప్రదర్శన నిర్వహించారు. అమరావతి కోసం పోరాడుతున్న చంద్రబాబుకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు.
1998లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన ప్రారంభించిన సీఎం రోడ్డులో చంద్రబాబుకు అపురూప స్వాగతం లభించింది. రోడ్డు ప్రారంభంలో క్రైన్ ద్వారా భారీ గజమాలతో స్వాగతం తెలిపారు. భవనాలపై నుంచి పూలవర్షం కురిపించారు. మహిళలు హారతులు ఇచ్చారు.
Updated Date - 2022-11-05T00:49:10+05:30 IST