పెళ్లింట విషాదం
ABN, First Publish Date - 2022-08-20T06:17:53+05:30
పెళ్లింట విషాదం
రోడ్డు ప్రమాదంలో నవ వధువు దుర్మరణం
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 19 : కాళ్ల పారాణి కూడా ఆరలేదు.. భర్తతో కలిసి బతకాలన్న ముచ్చటా తీరలేదు.. భవిష్యత్తుపై కన్న కలలూ నెరవేరలేదు.. ఆ నవ వధువుకు నిండు నూరేళ్లూ నిండిపోయాయి. మూడు ముళ్లు పడి మూడు నెలలు కూడా గడవకముందే మృత్యుఒడికి చేరింది. భర్తతో కలిసి అమెరికా వెళ్లాలన్న ఆశ తీరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఒక్కగానొక్క కుమార్తెను పోగొట్టుకుని ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించగా, మహాలక్ష్మిలా తమ ఇంట అడుగుపెట్టిన కోడలు ఇక లేదని తలచుకుని ఆ అత్తింటివారు కన్నీటిపర్యంతమయ్యారు. వివరాల ప్రకారం.. జి.కొండూరు మండలం కవులూరు గ్రామానికి చెందిన దేవినేని సాంబశివరావు, ఉషారాణికి లావణ్య (24) ఒక్కరే కూతురు. ఉన్నత చదువులు చదివించారు. లావణ్య హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తోంది. యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న గుంటుపల్లికి చెందిన పిన్నమనేని అఖిల్తో మూడు నెలల క్రితం లావణ్య వివాహం జరిపించారు. నెల క్రితం ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసింది. సెప్టెంబరు 10న భర్తతో కలిసి అమెరికా వెళ్లేందుకు విమాన టికెట్లు కూడా తీసుకున్నారు. అయితే, శ్రావణ శుక్రవారం కావటంతో కవులూరులో ఉన్న కారు తీసుకుని గుడికి వెళ్లాలని దంపతులు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఇద్దరూ బైకుపై బయల్దేరారు. మార్గంమధ్యలో ట్రాక్టరును తప్పించుకుని ముందుకెళ్లే క్రమంలో బైక్ అదుపు తప్పి కిందపడిపోయింది. తలకు తీవ్ర గాయమై లావణ్య అక్కడికక్కడే చనిపోయింది. అఖిల్కు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. మూడు నెలలుగా సంతోషంగా, ఉత్సాహంగా తిరిగిన లావణ్య విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులతో పాటు అత్తింటివారు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2022-08-20T06:17:53+05:30 IST