సోషల్ మీడియాలో తప్పుడు పోస్టు పెట్టాడని కేసు
ABN, First Publish Date - 2022-02-19T06:23:11+05:30
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టు పెట్టాడని కేసు
ఖమ్మం జిల్లా తెలుగు యువత నేతపై మైలవరం ఎమ్మెల్యే ఫిర్యాదు
ఖమ్మం క్రైం, ఫిబ్రవరి 18 : మైలవరం ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టు పెట్టాడనే ఫిర్యాదులపై తెలుగు యువత తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నున్నా నవీన్ చౌదరిపై మైలవరం పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో మైలవరం సీఐ శ్రీనివాస్ సిబ్బందితో శుక్రవారం ఖమ్మం నగరంలోని నవీన్ ఇంటికి వచ్చారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్పై నవీన్ ఇటీవల ఓ పోస్టు పెట్టారు. సదరు పోస్టుపై ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో నవీన్ను అదుపులోకి తీసుకునేందుకు ఏపీ పోలీసులు ఖమ్మం వచ్చారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో ఆచూకీ కోసం కుటుంబ సభ్యులను పోలీసులు ఒత్తిడి చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కమ్మ సంఘం నాయకులు అక్కడికి వెళ్లి పోలీసులతో మాట్లాడారు. నోటీసులు ఇచ్చి వెళ్లాలని కోరగా, పోలీసులు ఒప్పుకోలేదు. తమ సామాజికవర్గానికి చెందిన ఓ ఎమ్మెల్యేపై పోస్టు పెట్టినందుకు వ్యతిరేకంగానే ఆ పోస్ట్ షేర్ చేశారని, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న కార్యకర్తలను, నాయకులను ఇలా టార్గెట్ చేయడం సరైనది కాదని కమ్మ సంఘం నాయకులు తెలిపారు. నవీన్ ఎంతసేపటికీ రాకపోవడంతో అతడు వచ్చాక మైలవరం పోలీస్టేషన్కు రావాలని కుటుంబ సభ్యులకు తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Updated Date - 2022-02-19T06:23:11+05:30 IST