షరతుల్లేకుండా ధాన్యం కొనాలి
ABN, First Publish Date - 2022-12-07T00:47:18+05:30
ఆరుగాలం కష్టించి, అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పండించిన పంటను ఏ విధమైన షరతుల్లేకుండా గిట్టుబాటు ధరకు వెంటనే కొనుగోలు చేయాలని అన్నదాతలు మండలంలోని వెంకటాపురం రైతు భరోసా కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు.
మోపిదేవి/పెడన రూరల్, డిసెంబరు 6 : ఆరుగాలం కష్టించి, అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పండించిన పంటను ఏ విధమైన షరతుల్లేకుండా గిట్టుబాటు ధరకు వెంటనే కొనుగోలు చేయాలని అన్నదాతలు మండలంలోని వెంకటాపురం రైతు భరోసా కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. మండలంలోని వెంకటాపురం, శివరామపురం, రావివారిపాలెం గ్రామాల్లో ఖరీఫ్ వరి యంత్రాల ద్వారా కొద్ది రోజులుగా నూర్పిడి చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా మాత్రమే ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంది. 20 రోజులుగా మండలంలో కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. నూర్పిడి చేసిన ధాన్యాన్ని రైతులు రహదారుల వెంబడి ఆరబోసి ఆర్బీకేల చుట్టూ తిరుగుతున్నా తేమశాతం ఎక్కువగా ఉంది.. ఇంకా ఆరబెట్టాలని చెబుతున్నారని, ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్న అధికారులు ధాన్యాన్ని కొనుగోలులో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తహసీల్దార్ కె.నవీన్ కుమార్కు ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని తెలియజేశారు. ముఠా కార్మికులు రాకపోవటంతో ధాన్యంతో రైతు భరోసా కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. ఏ విధమైన షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అందుబాటులో ఉండేలా రవాణా సౌకర్యం కల్పించి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చూడాలని అధికారులను కోరారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తహసీల్దార్ దృష్టికి తీసుకొచ్చారు. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని తహసీల్దార్ తెలిపారు.
ధాన్యం అమ్మే స్వేచ్ఛ కూడా లేదా?
- తుమ్మా లక్ష్మీనారాయణ, కౌలు రైతు
కౌలుకు పొలం వ్యవసాయం చేసుకుని ఇప్పటికే వేలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి వరి సాగు చేశాం. కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులకు స్వేచ్ఛ లేదా? ధాన్యం అమ్ముకోవాలంటే మిల్లు నిబంధనలు ఏమిటి. ఏ విధమైన షరతుల్లేకుండా వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.
ఎప్పటికి కొనుగోలు చేస్తారు
- కొమ్ము చింతారావు, బోడగుంట
పంట నూర్చిన ఎన్నిరోజులకు కొనుగోలు చేస్తారో చెప్పండి. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం పంట నూర్చి 10 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కొనుగోలు చేయకుండా సాకులు చెబుతున్నారు. ఎన్ని రోజులు ధాన్యాన్ని రహదారుల వెంబడి పోసి కాపలా కాయాలి. కొనుగోలు చేయలేకపోతే ప్రభుత్వ నిబంధనలు సడలించి రైతులే నేరుగా ధాన్యాన్ని అమ్ముకునే సదుపాయం కల్పించ ండి
పెడన ఆర్బీకేకు వచ్చిన సమ్మెట రాంబాబుకు చెందిన పొలంలో యంత్రాలతో కోతలుకోసి 200 బస్తాలు సిద్ధంగా ఉన్నాయని తెలుపగా టెక్నికల్ అసిస్టెంట్ వెళ్లి చూసి తేమశాతం 25 ఉందని అన్నారు. ధాన్యం తీసుకెళ్లేందుకు లారీలు అందుబాటులో లేవన్నారు. ధాన్యం అలాగే ఉంచితే ముక్కిపోతుంది, నస్టం ఎవరు భరిస్తారు అని వాపోతున్నాడు. కొందరు రైతులు తమ ధాన్యంను మార్కెట్ యార్డ్ ఆవరణలో ఆరబోసుకుంటున్నారు. ఇలాగే కొనసాగితే చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయం వదలి ఇతర పనులకు వెళ్లేఅవకాశాలున్నాయి.
ముఖ్యమంత్రికి తెలుసా?
- సమ్మెట రాంబాబు (పెడన)
ధాన్యం కొనుగోలులో నిభంధనలు సడలించాలి. పంట సమయంలో కష్టపడతాం. ధాన్యం ఇంటికి వచ్చేవరకు ఆందోళన చెందుతాం. అది అమ్మేటప్పుడు కూడా శ్రమించాలంటే ఈ ప్రభుత్వం రైతులకు చేసే మేలేమిటి. రైతులతో ముఖాముఖీ మాట్లాడితే మా సమస్యలు తెలుస్తాయి.
కౌలు రైతులం మాకేం తెలుస్తుంది.
- దాసరి వేణుగోపాల కృష్ణ, కౌలురైతు
పదెకరాలు కౌలు చేస్తున్నా. పండించిన ధాన్యం అమ్మాలంటే ఎక్కడెక్కడికో తిరగాలంటున్నారు. నేరుగా రైతు వద్దకే వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తామంటున్నారు. పండించిన ధాన్యం ఇంటివద్ద ఉంది. అది అమ్మితేనే సొమ్ములు వచ్చేది.
Updated Date - 2022-12-07T00:47:20+05:30 IST