శ్రీలలిత.. శివజ్యోతి
ABN, First Publish Date - 2022-10-01T05:25:05+05:30
శ్రీలలిత.. శివజ్యోతి
శుక్రవారం భారీగా తరలివచ్చిన భక్తులు
తెల్లవారుజాము నుంచే నిండిపోయిన క్యూలు
రాత్రి వరకూ కొనసాగిన రద్దీ
కుంకుమార్చనలో ఉభయదాతల కోలాహలం
వర్షం కురుస్తూనే ఉన్నా తరలివచ్చిన భక్తజనం
జైదుర్గ అనే జయజయధ్వానాలు ఓవైపు.. వినసొంపైన వేద పఠనాలు మరోవైపు.. పవిత్ర పంచ హారతులు ఇంకోవైపు.. కుంకుమార్చనలో ఉభయదాతలు.. యువతుల భక్తిపూర్వక నమస్కారాలు.. మొక్కవోని ధైర్యంతో ముదుసలులు.. చిరునవ్వులు చిందించే చిన్నారులు.. వలంటీర్ల సేవలు.. వీటన్నింటినీ చూసి దుర్గమ్మ ముచ్చటపడి మురిసిపోయినట్టుంది. అందుకే కాబోలు శుక్రవారం ఉదయం నుంచి వాన చినుకులను అక్షితలుగా మార్చి చల్లుతూనే ఉంది. భక్తులు కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తండోపతండాలుగా తరలివచ్చారు.
విజయవాడ/చిట్టినగర్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : దుర్గమ్మకు ప్రీతికరమైన శుక్రవారం ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. ఐదో రోజున లలితా త్రిపురసుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనానికి బారులు తీరారు. తెల్లవారుజాము నుంచి మొదలైన రద్దీ మధ్యాహ్నం 2 గంటల వరకు సాగింది. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి భక్తుల తాకిడి పెరిగింది. కాగా, శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి గురువారం ప్రసాదాలు, టికెట్ల ద్వారా మొత్తం రూ.31లక్షల40వేల925 ఆదాయం వచ్చింది. వర్షం కారణంగా ప్రతిరోజూ నిర్వహించే నగరోత్సవాన్ని శుక్రవారం రద్దు చేశారు.
Updated Date - 2022-10-01T05:25:05+05:30 IST