ఆకట్టుకున్న భరత్శర్మ అష్టావధానం
ABN, First Publish Date - 2022-06-27T06:42:41+05:30
మహతి కళావేదికపై ఆదివారం రాత్రి వి.భరత్శర్మ చేసిన అష్టావధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంటర్ విద్యార్థి శర్మపై కవులు సంధించిన సమస్యలు, దత్తపదులకు అలవోకగా పద్యాలు అల్లి మంత్ర ముగ్ధులను చేశారు.
మచిలీపట్నం టౌన్, జూన్ 26 : మహతి కళావేదికపై ఆదివారం రాత్రి వి.భరత్శర్మ చేసిన అష్టావధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంటర్ విద్యార్థి శర్మపై కవులు సంధించిన సమస్యలు, దత్తపదులకు అలవోకగా పద్యాలు అల్లి మంత్ర ముగ్ధులను చేశారు. కారుమూరి రాజేంద్రప్రసాద్ నిషిద్ధాక్షరి చేపటి. హనుమత్ వైభవంపై పద్యా లు అల్లమన్నారు. దండిభొట్ల దత్తాత్రేయ శర్మ గుండ్రని కన్నులే వెలసే గుప్పున రాతికి నాతిపోలికన్ సమస్యను చెప్పగా అలవోకగా పూరించారు. డాక్టర్ ఓలేటి ఉమాసరస్వతి వైద్యుల గొప్పతనంపై పద్యం చెప్పమన్నారు. సీతారాములను చూసి తన భార్యను గుర్తు చేసుకునే మానసిక స్థితిపై వర్ణించమని జంపాన చంద్రిక కోరారు. కొమ్మరాజు కనకదుర్గా మహాలక్ష్మి రావి.. మావి.. తావి.. భావి పదాలతో భారతీయ సంస్కృతి వైభవాన్ని వర్ణించమంటూ దత్తపది ఇచ్చారు. అసువుగా స్వర్ణదుర్గా ప్రసాద శ్రీకృష్ణ దత్తు, తిరుపతి లడ్డు, బందరు లడ్డు ఎన్ని తరాలు మారినా రుచి ఎందుకు మారదని పద్యం చెప్పమన్నారు. రచయిత్రి సీతారావమ్మ చందోభాషణం చేశారు. భవిష్య అప్రస్తుత ప్రసంగం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. శతావధాని ఆముదాల మురళి సంచాలకులుగా వ్యవహరించగా, జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు, న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, బచ్చుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం స్థానాచార్యులు ముత్తేవి శశికాంత్, రామ్మోహనరావు, లాల్బహదూర్ శాస్ర్తి, రావినూతల శర్మ పాల్గొన్నారు. అవధానిని ఘనంగా సత్కరించారు.
Updated Date - 2022-06-27T06:42:41+05:30 IST