నీ అంతు చూస్తా!
ABN, First Publish Date - 2022-05-18T09:25:23+05:30
‘ఒరేయ్ సాయీ.. నీ అంతు చూస్తా.. నిన్ను హతమారుస్తా!’ అంటూ..
త్వరలో నిన్ను హతమారుస్తా
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథశర్మ
ఇంటి గోడకు హెచ్చరిక పోస్టర్లు
కారు అద్దాలు ధ్వంసం
కమలాపురంలో కలకలం
హేయమైన చర్య: బ్రాహ్మణ ఫ్రంట్
కమలాపురం రూరల్/గుంటూరు, మే 17: ‘ఒరేయ్ సాయీ.. నీ అంతు చూస్తా.. నిన్ను హతమారుస్తా!’ అంటూ.. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథశర్మ ఇంటి గోడకు గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరిక పోస్టర్లు అంటించారు. అదేవిధంగా ఆయన కారు అద్దాలను పగులగొట్టారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కమలాపురం మండలం రామాపురానికి చెందిన సాయినాథశర్మ కమలాపురంలో నివాసం ఉంటున్నారు. వీరికి సొంతూరు రామాపురంలో మోక్షనారాయణస్వామి ఆలయం ఉంది. నాలుగు రోజులుగా ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన నాలుగురోజులుగా రామాపురంలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి ఆయన నిద్రిస్తున్న సమయంలో బయట నిలిపి ఉంచిన కారు అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టారు. అలాగే కమలాపురంలోని సాయినాథశర్మ ఇంటిగోడకు ‘ఒరేయ్ సాయి.. నీ అంతు చూస్తా.. నిన్ను తొందరలో హతమారుస్తా’, ‘ఒరేయ్ సాయి.. చావుకు సిద్ధంగా ఉండు’ అని రాసిన కాగితాలను అంటించారు. మంగళవారం ఉదయం వీటిని గుర్తించిన ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సాయినాథ శర్మ మాట్లాడుతూ.. కమలాపురానికి బుధవారం చంద్రబాబు రానున్న నేపథ్యంలో ఇలాంటి దాడి పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. టీడీపీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు కొద్దిరోజులుగా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నట్టు చెప్పారు. ఇది జీర్ణించుకోలేని వారు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, సాయినాథ శర్మకు హెచ్చరికలు జారీ చేయడం, వాహనంపై దాడి చేయటం హేయమైన చర్య అని బ్రాహ్మణ ఫ్రంట్ ఏపీ విభాగం అధ్యక్షుడు డాక్టర్ రామరాజు శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా విభేదాలుంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని హితవు పలికారు.
Updated Date - 2022-05-18T09:25:23+05:30 IST