పునరావాసమేది?
ABN, First Publish Date - 2022-12-13T00:08:17+05:30
సమ్మర్ స్టోరేజి ట్యాంకు నిర్మాణంలో మీ గ్రామం ముంపునకు గురవుతుంది.. మీకు వేరే చోట పక్కా ఇళ్లు కట్టిస్తాం..గ్రామాన్ని వదలండంటూ రెవిన్యూ అధికారులు హామీ ఇచ్చారు. ఇది జరిగి పన్నెండేళ్లు అయినా ఇంతవరకు మాకు పునరావాసం కల్పించలేదు. మాకు ఇళ్లు కట్టించేంత వరకు గ్రామం వదలమని మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ నాయనివారిపల్లె గ్రామస్థులు చెబుతున్నారు.
పన్నెండేళ్లుగా ఎదురుచూపు
భయం గుప్పిట్లో నాయనివారిపల్లె
వర్షానికి నిండుతున్న ఎస్ఎస్ ట్యాంకు
భయం గుప్పిట్లో ప్రజలు
మదనపల్లె టౌన్, డిసెంబరు 12: సమ్మర్ స్టోరేజి ట్యాంకు నిర్మాణంలో మీ గ్రామం ముంపునకు గురవుతుంది.. మీకు వేరే చోట పక్కా ఇళ్లు కట్టిస్తాం..గ్రామాన్ని వదలండంటూ రెవిన్యూ అధికారులు హామీ ఇచ్చారు. ఇది జరిగి పన్నెండేళ్లు అయినా ఇంతవరకు మాకు పునరావాసం కల్పించలేదు. మాకు ఇళ్లు కట్టించేంత వరకు గ్రామం వదలమని మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ నాయనివారిపల్లె గ్రామస్థులు చెబుతున్నారు. ప్రస్తుతం తుఫానుతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో గ్రామానికి ఎగువన ఉన్న గుంటివారిపల్లె సమ్మర్ స్టోరేజి ట్యాంకు వర్షపు నీటితో నిండుతోంది. ఇది పూర్తిగా నిండితే ఈ గ్రామంలోని 29 ఇళ్లు ముంపునకు గురి కావడంతో పాటు గ్రామంలోని వంద మంది ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి భయం భయంగా గడుపుతున్నారు. మదనపల్లె పట్టణానికి తాగునీరు అందించేందుకు 2008 హంద్రీనీవా కాలువకు అనుసంధానంగా పట్టణానికి పడమర చిప్పిలి ఎస్ఎస్ ట్యాంకుతో పాటు ఆగ్నేయంలోని వలసపల్లె పంచాయతీ గుంటివారిపల్లె వద్ద సమ్మర్ స్టోరేజి ట్యాంకు నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గుంటివారిపల్లె ఎస్ఎస్ ట్యాంకు నిండితే ఎగువన ఉన్న నాయనివారిపల్లె గ్రామం ముంపునకు గురవుతోంది. దీంతో అప్పట్లో రెవెన్యూ అధికారులు ఆర్అండ్ఆర్ కింద ఈ గ్రామంలోని 29 కుటుంబాలకు వేరే చోట ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా 2010లో ఎస్ఎస్ ట్యాంకు నిర్మాణం చేపట్టి 2012లో పూర్తి చేశారు. ఇది జరిగి పన్నెండేళ్లు అవుతున్నా నాయనివారిపల్లె గ్రామస్థులకు ప్రభుత్వం పునరావాసం కల్పించలేదు. దీంతో 20 కుంటుంబాలు పల్లెలోనే నివాసం ఉన్నారు. 1992లో కట్టించిన కాలనీలోని ఇళ్లు నేడు పెచ్చులూడి వర్షానికి ఉరుస్తున్నాయి. ఇవి పోను 9 పూరి గుడిసెల్లో నివశిస్తున్న వారు వర్షం నుంచి గుడిసెలను కాపాడుకోవడానికి ప్లాస్టిక్ పట్టలను పైకప్పుకు చుట్టి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎస్ఎస్ ట్యాంకు ముంపునకు గురవుతున్న నాయనివారిపల్లె గ్రామస్థులకు పునరావాసం కల్పించి, న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇస్తామన్నారు
-వేమనారాయణ, నాయనివారిపల్లె, మదనపల్లె మండలం
మా గ్రామంలో ఉన్నత చదువులు చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. కానీ ఏది జరగలేదు. గట్టిగా వర్షాలు వస్తే ఎస్ఎస్ ట్యాంకు ఎక్కడ నిండిపోతుందో.. మా ఊరిలోని నీళ్లు వస్తాయేమో అని రాత్రి, పగలు కాపలా కాస్తున్నాం. పన్నెండేళ్లుగా అధికారులకు అర్జీలు ఇస్తున్నా..మా ఊరిపై కనికరం చూపలేదు.
Updated Date - 2022-12-13T00:08:19+05:30 IST