ఫిర్యాదుదారులకు త్వరితగతిన న్యాయం చేస్తాం
ABN, First Publish Date - 2022-09-20T04:58:44+05:30
స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసే ప్రతి ఫిర్యాదు దారుడి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎస్పీ హర్షవర్ధన్రాజు అన్నారు.
స్పందనలో ఎస్పీ హర్షవర్ధన్రాజు
రాయచోటి టౌన్, సెప్టెంబరు 19: స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసే ప్రతి ఫిర్యాదు దారుడి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎస్పీ హర్షవర్ధన్రాజు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 74 మంది ఫిర్యాదుదారుల అర్జీలను స్వయంగా స్వీకరించారు. అలాగే పిటీషనర్ల బాధలు, సమస్యలను సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు. ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీసుస్టేషన్ల పరిధిలోని అధికారులతో ఎస్పీ ఫోన్ చేసి మాట్లాడి అందిన ప్రతి ఫిర్యాదుపై వెంటనే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుని బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని ఆదేశించారు. అలాగే స్పందన ఫిర్యాదులపై వారు తీసుకున్న చర్యలపై కూడా నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకుని వారి సమస్యలను స్వేచ్ఛగా విన్నవించుకోవచ్చునన్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు బదలాయించి చట్ట పరిధిలో విచారణ జరిపి సత్వరం ఫిర్యాదుదారుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Updated Date - 2022-09-20T04:58:44+05:30 IST