పథకాల అమలుకు బ్యాంకర్లు సహకరించాలి
ABN, First Publish Date - 2022-08-11T05:44:45+05:30
పథకాల అమలు, అభివృద్ధి పనుల కోసం బ్యాంకర్లు ప్రభుత్వానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ పీఎస్ గిరీషా కోరారు.
రాయచోటి(కలెక్టరేట్), ఆగస్టు 10: పథకాల అమలు, అభివృద్ధి పనుల కోసం బ్యాంకర్లు ప్రభుత్వానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ పీఎస్ గిరీషా కోరారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జగనన్న తోడు లబ్ధిదారులకు రుణాల మంజూరుపై డీసీసీ బ్యాంకర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వానికి తోడుగా ఉండాలని కోరారు. వీధుల్లో చిరు వ్యాపారులు, చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి పెట్టుబడి కింద జగనన్న తోడు పథకం ద్వారా బ్యాంకుల ద్వారా రూ.10 వేలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలన్నారు. ఈ పథకంలో వచ్చే దరఖాస్తులను బ్యాంకులు వీలైనంత త్వరగా పరిష్కరించి రుణాలు మంజూరు చేయాలని కోరారు. అందులో భాగంగా జగనన్న తోడు పథకం కింద జిల్లాలో 18,993 మంది లబ్ధిదారులకు రుణాలు ఇవ్వాలని లక్ష్యం కేటాయించామని, ఇంకా 8 వేల మందికి రుణం ఇవ్వాల్సి ఉందని, వీలైనంత త్వరగా రుణం ఇవ్వాలన్నారు. ఇదే కాకుండా అదనంగా జగనన్న తోడు పథకం ద్వారా 13,269 మంది చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చి తోడ్పడాలని బ్యాంకర్లను కలెక్టర్ ఆదేశించారు. అవకాశం ఉంటే వీలైనంత ఎక్కువ మందికి రుణాలు ఇవ్వాలన్నారు. వెలుగు ఏపీయం బ్యాంకులు దగ్గరికి వెళ్లి త్వరగా దరఖాస్తులను రెన్యూవల్ చేయించేలా చర్యలు తీసుకోవాలని డీఆర్డీఏ పీడీని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఎల్డీయం మధుసూదన్రావు, డీఆర్డీఏ పీడీ సత్యనారాయణ, అన్ని బ్యాంకుల ఆర్యంలు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-11T05:44:45+05:30 IST