దుబాయిలో ఉద్యోగం పేరిట వల
ABN, First Publish Date - 2022-02-07T08:56:05+05:30
లక్షన్నర కడితే దుబాయిలో ఉద్యోగం, మంచి జీతం అన్నాడు. మన ఊరి వాడే కదా.. అని నమ్మిన 15 మంది యువకులు అప్పుచేసి మరీ రూ.2.25 కోట్లు చేతిలో పెడితే నట్టేట ముంచాడు. వివరాలివీ.. తూర్పుగోదావరి జిల్లా ఇరగవరం మండలం..
- 15 మంది నుంచి 2.25 కోట్లు వసూలు
- రోడ్డునపడ్డ 15 మంది తెలుగు యువకులు
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
లక్షన్నర కడితే దుబాయిలో ఉద్యోగం, మంచి జీతం అన్నాడు. మన ఊరి వాడే కదా.. అని నమ్మిన 15 మంది యువకులు అప్పుచేసి మరీ రూ.2.25 కోట్లు చేతిలో పెడితే నట్టేట ముంచాడు. వివరాలివీ.. తూర్పుగోదావరి జిల్లా ఇరగవరం మండలం అర్జునుడుపాలెం గ్రామానికి చెందిన ముళ్లపూడి వడ్డీకాసులు కొన్నేళ్లుగా దుబాయిలో ఉంటున్నాడు. మంచి ఉద్యోగం, ఆకర్షణీయమైన జీతం ఇప్పిస్తానని ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 15మంది యువకులకు వలవేశాడు. వారిలో ఎక్కువ మంది రావులపాలెం పరిసర ప్రాంతాలకు చెందిన వారున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.1.5 లక్షలు వసూలు చేశాడు. వారిని విజిటింగ్ వీసాపై దుబాయికి తీసుకొచ్చి వదిలేశాడు. ఉద్యోగం గురించి ప్రశ్నిస్తే రేపుమాపంటూ.. మభ్యపెడుతూ మూడు క్యాంపులు మార్చాడు. మూడో క్యాంపునకు అద్దె చెల్లించకపోవడంతో యువకులందర్నీ కట్టుబట్టలతో తరిమివేశారు.
నిలదీయడంతో ఫోన్ స్విచాఫ్ చేశాడు. దుబాయిలో ప్రవాసాంధ్ర ప్రముఖుడు, జనసేన నేత కేసరి త్రిమూర్తులు యువకులకు ఆశ్రయం కల్పించారు. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. కాగా.. పాకిస్థాన్కు చెందిన వ్యక్తి వద్ద వడ్డీకాసులు ఉద్యోగం చేస్తున్నాడని, ఆ ఇద్దరూ కలిసి యువకులను మోసం చేశారని భావిస్తున్నారు.
Updated Date - 2022-02-07T08:56:05+05:30 IST