వివేకా కేసులో జగన్ను విచారించాల్సిందే: లోకేశ్
ABN, First Publish Date - 2022-03-05T00:50:37+05:30
రాష్ట్రంలో పెనుసంచలనంగా మారిన మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ పాత్రపై సీబీఐ విచారణ జరపాలని టీడీపీ జాతీయ
మంగళగిరి: రాష్ట్రంలో పెనుసంచలనంగా మారిన మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ పాత్రపై సీబీఐ విచారణ జరపాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో శుక్రవారం పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ హత్యలో కడప ఎంపీ అవినాష్రెడ్డి పాత్ర ఉన్నట్టు ఇప్పటికే స్పష్టంగా తేలిపోయిందన్నారు. ఈ విషయం అందరికీ అర్ధమైనప్పటికీ జగన్, అవినాష్రెడ్డిని రక్షించేందుకు నానా తంటాలు పడుతున్న తీరు చూస్తుంటే... మరెన్నో అనుమానాలు పుట్టుకొస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ తన సొంత బాబాయి హత్యకేసులో నిజమైన నిందితులను కనిపెట్టి శిక్షించాల్సింది పోయి వారిని రక్షించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. ప్రభుత్వపెద్దలు న్యాయవ్యవస్థను కించపరచడం మాని తీర్పును హుందాగా గౌరవిస్తూ అమరావతిని అభివృద్ధి చేయాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2022-03-05T00:50:37+05:30 IST